అశ్వారావుపేట, ఫిబ్రవరి 27 : ప్రజారోగ్యంతోపాటు జీవాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్గా వచ్చే వ్యాధులను గుర్తించి ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీని పశు సంవర్ధక శాఖాధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 3,55,868 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 1,55,406, మేకలు 2,00,462 ఉన్నాయి. 53 బృందాలు ప్రత్యేకంగా నట్టల నివారణ మందు పంపిణీలో పాల్గొంటున్నాయి.
కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని పశు వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందుతో ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఈ అవకాశాన్ని జీవాల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. మొదటిరోజు జిల్లాలోని 73 గ్రామాల్లో 20,537 గొర్రెలు, 18,754 మేకలు మొత్తం 39,291 జీవాలకు బృందాలు మందు తాగించారు. దీనివల్ల 584 మంది యజమానులు లబ్ధి పొందారు.
జీవాలకు నట్టల బెడద సర్వసాధారణం. నేలకు దగ్గరగా జీవాలు మేత మేయడం వల్ల జీవాలకు ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. మేత కొరత, పోషకాల లోపం, వానకాలం, అనావృష్టి, అంటువ్యాధులు ప్రబలిన సందర్భాల్లో ఈ పరాన్నజీవుల బెడద అధికంగా ఉంటుంది. నట్టల్లో ప్రధానంగా ఏలికపాము, బద్దె పురుగులు, జలగలు వంటి మూడు రకాలు ఉంటాయి. ఇవి శరీరం, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశయంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆశ్రద్ధ చేస్తే జీవాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పశు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా బుధవారం లాంఛనంగా ప్రారంభమైన మందు పంపిణీ ఈ నెల 28వ వరకు అంటే వారంరోజుల పాటు కొనసాగిస్తామని పశు సంవర్ధకశాఖ స్పష్టం చేసింది. జిల్లాలోని 23 మండలాల్లో 106మంది వైద్యులు, సిబ్బంది 53 బృందాలుగా నట్టల నివారణ మందు పంపిణీలో పాల్గొంటున్నారు. నట్టల లక్షణాలు, నివారణ చర్యలు, కలిగే ప్రయోజనాలను మండలాల వారీగా యజమానులకు వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
జీవాల్లో నట్టల నివారణపై యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాలకు మందు తప్పనిసరిగా వేయాలి. ప్రతి ఏడాది ప్రభుత్వం ఉచితంగానే నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నది. జీవాల పేడ నమూనాలను సేకరించి, పరీక్షించిన తర్వాతనే ఫలితాల ఆధారంగా నట్టల నివారణ మందును ఎంపిక చేస్తాం. జీవాల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ బోడేపూడి పురంధర్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి, కొత్తగూడెం