వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆస్పత్రి. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. వైద్యులు, సిబ్బంది లేక.. సకాలంలో రోగులకు సేవలు అందక నానా అవస్థలు పడ్డారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అప్పుచేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. రోగమొస్తే బతుకులు ఇంతేనా అనుకునే క్రమంలోనే తెలంగాణ సిద్ధించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే హరిప్రియ ఆస్పత్రి పరిస్థితిని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు వివరించి అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేశారు. దీంతో మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లెందు రూరల్, ఆగస్టు 6 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పాలకుల నిర్లక్ష్యంతో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థలో కొట్టుమిట్టాడేది. సుదూర ప్రాంతాల నుంచి రోగులు ఆస్పత్రికి వచ్చినా సరిగా వైద్యం అందకపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు పల్లె, పట్టణ దవాఖానలను ఏర్పాటు చేసి.. వైద్యులు, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ చెక్కులు, ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నూతన వైద్య విధానం, ఆధునిక యంత్రాలు.. ఇలా ఒక్కటేమిటి లక్షలు గుమ్మరించినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో దొరకని సౌకర్యాలు, సదుపాయాలు నేడు నిరుపేదలకు సీఎం కేసీఆర్ పరిపాలన వలన సర్కార్ దవాఖానల్లో అందుతున్నాయి. ఈ క్రమంలోనే వందేళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన బొగ్గుట్టకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. 30 నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. టేకులపల్లి, కామేపల్లి, బయ్యారం, గార్ల, ఇల్లెందు పట్టణ ప్రజలు, మండల వాసులకు ఏదైనా ప్రమాదం జరిగినా, విషసర్పాలు కాటేసినా, గర్భిణులు ప్రసవాలు చేయించుకోవాలన్నా ఇల్లెందు ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయిస్తారు. గతంలో ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు చికిత్స తీసుకునేందుకు ఇతర ప్రాంతాలు, నగరాలు, పట్టణాలకు వెళ్లి అవస్థలు పడేవారు. అయితే ఎమ్మెల్యే హరిప్రియానాయక్ చొరవతో ఇల్లెందు ఆస్పత్రి వైద్య విధాన పరిషత్లోకి మార్చారు.
ప్రైవేటును తలదన్నేలా..
ప్రస్తుతం 10 మంది డాక్టర్లతోపాటు రక్త, టీబీ వ్యాధి నిర్ధ్దారణ పరీక్షలు, స్కానింగ్, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణతోపాటు ప్రసవాలను విజయవంతంగా చేస్తున్నారు. ఖర్చుతో కూడిన డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో రోగుల ఆనందానికి అవధులు లేవు. ఇల్లెందులో ఉచితంగా డయాలసిస్ చేస్తుండడంతో కష్టాలతోపాటు ప్రయాణ ఖర్చుల భారం తగ్గిందని రోగులు చెబుతున్నారు. రోజూ ప్రభుత్వాస్పత్రిలో 6-8 మంది డయాలసిస్ కోసం తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటైతే సుమారు 50 మంది డాక్టర్లతోపాటు మరిన్ని ఆధునిక యంత్రాలు, వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలతోపాటు సౌకర్యాలు సమకూరనున్నాయి. నిరంతర వైద్య సదుపాయం ఐదు మండలాల ప్రజలకు అందుబాటులోకి రానుంది.
సీఎం కేసీఆర్ దేవుడితో సమానం
అడగకుండానే వరాల మీద వరాలు కురిపిస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దేవుడితో సమానం. దేశంలోనే గొప్ప సీఎం. ఇల్లెందు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మొన్న ఇల్లెందును వైద్య విధాన పరిషత్లోకి మార్చారు. నిన్న డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. నేడు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎప్పటికీ మరచిపోలేం.
– బానోతు హరిప్రియానాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే
బాధ్యతలు మరింత పెరిగాయి
పడకల స్థాయి పెరగడంతో బాధ్యతలు మరింతగా పెరిగాయి. రోగులకు మరిన్ని సౌకర్యాలు, సదుపాయాలతోపాటు సుమారు 40 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఏజెన్సీ వాసులకు వైద్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా చికిత్స వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మరిన్ని ఆధునిక పరికరాలతోపాటు యంత్రాలు సమకూరుతాయి.
– డాక్టర్ రవిబాబు, డీసీహెచ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రోజూ ఓపీ పెరుగుతుంది
డాక్టర్లుగా మేము రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వాస్పత్రిలో ఓపీ ప్రతిరోజూ పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే హరిప్రియానాయక్ 30 నుంచి 100 పడకలుగా చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. సీఎం కేసీఆర్ వంద పడకల ఆస్పత్రిగా ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. మరింత ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది.
– డాక్టర్ శిరీష్, ప్రభుత్వాస్పత్రి ఇన్చార్జ్, ఇల్లెందు
ఇక్కడే పరీక్షలు చేయించుకుంటాం
గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇల్లెందును పరిపాలించారు. సీఎం కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియనాయక్ చేస్తున్న అభివృద్ధి కళ్ల ముందు కనపడుతున్నది. ఇల్లెందు ఆస్పత్రిని అభివృద్ధి చేయడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక ఏ జబ్బు వచ్చినా ఇక్కడే పరీక్షలు చేయించుకుంటాం. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– బొల్లి రవి, హమాలీ కార్మికుడు, ఇల్లెందు
వృద్ధులకు ఎంతో మేలు
డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేటు దవాఖానలకు వెళ్లకుండా ఇక్కడే పరీక్షలు చేయించుకుంటాం. సీఎం కేసీఆర్ సారు ఇల్లెందు దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పించడం బాగుంది. మా లాంటి వృద్ధులకు ఎంతో మేలు జరుగనుంది. వంద పడకలు చేయడంతో డాక్టర్లు మరింత పెరుగుతారు. సీఎం కేసీఆర్ పరిపాలన వల్ల బతికుండగానే మంచి రోజులు చూస్తున్నాం. సీఎం సల్లగుండాలి.
– రాయల ఎల్లమ్మ, 3వ వార్డు