అశ్వారావుపేట/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 9: ఈ విద్యా సంవత్సరంలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15న ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఈ నెల 29తో ముగుస్తాయి. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమి షం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీనే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చారు. 19,867 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని వసతులు కల్పిస్తున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సమీక్షలు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ జిల్లా విభాగం, హైపవర్ కమిటీ బాధ్యులతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు భాగం కానున్నారు. 3 సిట్టింగ్ స్కాడ్లు, 2 ఫ్లయింగ్ స్కాడ్లతోపాటు 70 మంది ఏఎన్ఎంలు, 520 మంది ఇన్విజిలేటర్లను ఇంటర్ విద్యాశాఖాధికారులు నియమించారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు జిల్లాలో 5 పాయింట్లను గుర్తించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులుగానీ, ఇన్విజిలేటర్లు గానీ, అధికారులు గానీ సెల్ఫోన్లు తీసుకెళ్ల కూడదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలం అయినందున విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
35 పరీక్షా కేంద్రాలు..
జిల్లాలోని 23 మండలాల్లో 36 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 19,867 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 9,504 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,363 మంది ఉన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంతోపాటు డివిజన్ కేంద్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికంటే గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
పరీక్షల కమిషనర్గా కలెక్టర్..
జిల్లా పరీక్షల కమిటీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్నామన్నారు. మణుగూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్, అశ్వాపురం హిస్టరీ లెక్చరర్ సుధాకర్రెడ్డిలతో డీఈసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు కమిషనర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రెవెన్యూ స్కాడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికీ డిప్యూటీ తహసీల్దార్ని నియమించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేశారు.
‘టెలీమానస్’ ద్వారా కౌన్సెలింగ్
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి తగ్గించేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ‘టెలీమానస్’ను ఏర్పాటు చేసింది. ఇందులో 8 మంది మానసిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్లు తల్లిదండ్రులు గుర్తిస్తే.. వెంటనే ఈ కమిటీ సభ్యులను సంప్రదించాలి. ఇందుకోసం 14416 టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే విద్యార్థులకు మానసిక వైద్య నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తారు. సరైన సూచనలు అందించి ఒత్తిడిని జయించేలా సహాయ పడతారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఈ నెల 15న ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను కేటాయించాం. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 19,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ ముగిశాయి. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ పూర్తయింది.
-బేరి సులోచనారాణి, డీఐఈవో, కొత్తగూడెం