రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు చేపట్టి రేపటితో మూడేండ్లు పూర్తవుతున్నది. ఈ మూడేండ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్లింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపారు మంత్రి పువ్వాడ. సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం రూపురేఖలనే మార్చేశారు. అధ్వానంగా ఉన్న రహదారులు నాలుగు లైన్ల రహదారులుగా మారాయి.. డివైడర్లు ఏర్పడ్డాయి.. పచ్చదనం పరుచుకున్నది.. కళ్లు జిగేల్ మనేలా సెంట్రల్ లైటింగ్ విద్యుత్కాంతులు విరజిమ్ముతున్నాయి.. చెరువుల సుందరీకరణ, మినీ ట్యాంక్బండ్ల నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలు గల వైకుంఠధామాలతోపాటు ధంసలాపురం ఆర్ఓబీ నిర్మాణం, పోలీస్ కమిషనరేట్, గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులతో ఖమ్మం అభివృద్ధి గుమ్మంగా మారింది. రెండు జిల్లాల్లో సమీకృత కొత్త కలెక్టరేట్లు, మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంతేకాకుండా కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వేలైన్ పూర్తికావడానికి మంత్రి కృషిచేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న మంత్రి పువ్వాడ మూడేండ్ల పాలనపై ప్రత్యేక కథనం.
ఖమ్మం, సెఫ్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. దినదినం పురోగతి సాధిస్తున్నది. రాష్ట్ర మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు స్వీకరించి రేపటితో మూడేండ్లు పూర్తవుతుంది. అనేక సంవత్సరాలుగా సాధించని అభివృద్ధిని ఈ మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించిన ఘనుడు మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ మూడేండ్ల కాలంలోనే ఎన్నో మార్పులను సంతరించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా మంత్రి పువ్వాడ ఖమ్మం రూపురేఖలు మార్చేస్తున్నారు. కొంతకాలంగా అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా సరికొత్తగా ముస్తాబవుతున్నది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం, ఖమ్మానికి మెడికల్ కళాశాల, ఖమ్మంలో రెండోదశ ఐటీ హబ్ నిర్మాణంతోపాటు ప్రధాన రోడ్లను విస్తరించి అందంగా ముస్తాబు చేయడం, కూడళ్లకు సొబగులు అద్దడం, చెరువుల సుందరీకరణ, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు మినీ ట్యాంక్బండ్ల నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠధామాల ఏర్పాటుతోపాటు ధ్వంసలాపురం ఆర్ఓబీ నిర్మాణం, పోలీస్ కమిషనరేట్, గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు, ఐటీ హబ్ నిర్మాణం, పార్క్ల అభివృద్ధి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాల ఆవిష్కరణ జరగడంతో ఖమ్మం ఆధునిక నగరంగా మారింది. దీంతోపాటు కొత్తగూడెం సత్తుపల్లి రైల్వేలైన్ పూర్తికావడానికి మంత్రిగా పువ్వాడ తనవంతు కృషిచేశారు. సత్తుపల్లి సింగరేణి నుంచి బొగ్గురవాణా ఈ కొత్త రైలు మార్గం ద్వారానే జరుగుతున్నది. ఇక జూన్, జూలై నెలలో గోదావరి వరద సృష్టించిన బీభత్సంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలోని ముంపు బాధిత ప్రాంత ప్రజలకు మంత్రి అండగా నిలిచారు. వరద పరిస్థితిని సీఎం కేసీఆర్కు వివరించి ఆయనను ఒప్పించి వెయ్యి కోట్లతో సురక్షిత ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కృషి, బాధితులకు అందించిన సేవలను సీఎం కొనియాడారు.
రూ.20 కోట్లతో కమ్యూనిటీ భవనాలు
ఖమ్మం నగరంలోని అనేక కులాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కమ్యూనిటీ భవనాలను రూ.20 కోట్లతో నిర్మించడంతో ఆయా వర్గాల ప్రజలు ఆ భవనాలను శుభకార్యాలకు ఉపయోగించుకుంటున్నారు.
పీవీ, జయశంకర్ సార్ విగ్రహాలు
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని లకారం ట్యాంక్బండ్ ప్రధాన ముఖద్వారం వద్ద (మమత ఆసుపత్రి రోడ్డులో) రూ.11 లక్షలతో ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మంత్రి ప్రత్యేక చొరవతో ముస్తాఫానగర్ నుంచి బ్రిడ్జి ఎక్కే సెంటర్లో ఏర్పాటు చేశారు.
మహాత్ముడి విగ్రహంతో గాంధీచౌక్కు కళ
రూ.50 లక్షల వ్యయంతో గాంధీచౌక్ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ ఫౌంటేన్ను నిర్మించి గ్రీనరీ, లైటింగ్ ఏర్పాటు చేశారు. త్రీటౌన్ ప్రాంతం మొత్తానికి గాంధీచౌక్ ఐకాన్గా మారింది.
రూ.24 కోట్లతో లకారం అభివృద్ధి
స్వరాష్ట్ర సాధన ఉద్యమ ఫలాలను అన్ని ప్రాంతాలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నగరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిలో భాగంగానే లకారం చెరువును దాదాపు రూ.24 కోట్లతో ప్రభు త్వం ఆధునీకరించింది. నగర ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తరహాలో అందమైన ట్యాంక్బండ్ను ప్రభుత్వం నిర్మించింది.
రూ.1.20 కోట్లతో మినీ ట్యాంక్బండ్
ఖమ్మం నగరం 5వ డివిజన్ పరిధిలో ఉన్న ఖానాపురం ఊరచెరువును ‘మినీ ట్యాంక్బండ్’గా సుందరీకరణకు ప్రభుత్వం రూ.1.20 కోట్లు కేటాయించింది. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరచెరువును మినీ ట్యాంక్బండ్గా చేయడంతో ఖమ్మానికే కొత్తకళ వచ్చింది. విశాలమైన ప్రాంగణంలో ఇల్లెందు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఊరచెరువును మంత్రి అజయ్ ఖమ్మం కార్పొరేషన్కు చెందిన జనరల్ ఫండ్ నిధులతో అభివృద్ధి చేశారు.
రూ.77 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి
ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద రూ.77 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. మంత్రి పువ్వాడ ప్రత్యేక కృషి, చొరవ కారణంగా బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజల బాధలు తొలగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం రావడానికి ప్రధాన రహదారైన ధంసలాపురం వద్ద రైల్వే గేటు ఉండటం వల్ల ఇరుప్రాంతాల వాహనదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. బ్రిడ్జి నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపారు మంత్రి.
రెండు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులు మంత్రి సారథ్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఖమ్మానికి మెడికల్ కళాశాల మంజూరు
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాలను మంత్రి పువ్వాడ ప్రత్యేక కృషితో సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి వైద్యకళాశాలను ప్రారంభిస్తూ 100 సీట్లను కేటాయించారు. తరగతుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్ కళాశాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్ భవనాలు, ఆర్అండ్బీ శాఖల స్థలాన్ని వైద్యశాలకు అప్పగించనున్నారు. జిల్లా ఆసుపత్రిలో రూ.2.15 కోట్లతో సిటీ స్కాన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో 104 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అప్గ్రేడ్ చేశారు.
రూ.70 కోట్లతో గోళ్లపాడు చానల్పనులు
ఒకనాడు పచ్చని పంట పొలాలకు సాగునీరందించిన గోళ్లపాడు చానల్ కొన్ని ఎర్రచొక్కాలు, మరికొన్ని మూడు రంగుల చొక్కాల కారణంగా మురికి కూపంగా మారితే గులాబీ చొక్కా మాత్రం రూ.70 కోట్లతోఆ మురికిని తొలగించి దానిపై కప్పు వేసింది. కాలువపై పచ్చనిహారాన్ని, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఓపెన్ జిమ్లు, పార్క్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసి కొత్త చరిత్రకు నాంది పలికింది. మంత్రి పట్టుదలతో గోళ్లపాడు చానల్ మురికి కాలువ చరిత్రను లేకుండా చేసింది. వరద ప్రవహించడానికి దానిపై ప్రత్యేక పైప్ లైన్లు కూడా నిర్మించింది.
రూ.27 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణం
మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర నగరాలకు విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని తరువాత వరంగల్, కరీంనగర్తోపాటు ఖమ్మం నగరంలో రూ.27 కోట్లతో ఐటీ హబ్ను నిర్మించారు. మంత్రి అజయ్ చొరవతో ఐటీ హబ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించారు. వివిధ ఐటీ కంపెనీలకుగాను 425 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ ఐటీ హబ్లో ఇప్పటికే 16 కంపెనీలు భాగస్వాములయ్యాయి. ఇటీవల ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాబ్మేళాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 5వేల మంది యువత హాజరయ్యారు.
త్వరలో రెండో దశ పనులు..
ఖమ్మంలో మొదటి దశ ఐటీ హబ్ నిర్మాణ పనులను పూర్తి చేసుకొని ప్రారంభించడం జరిగింది. రెండో దశను కూడా మంత్రి కేటీఆర్ సూచనల మేరకు త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. అవసరం మేరకు 3, 4 దశల్లో కూడా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు.
ఆహ్లాదపరుస్తున్న పార్కులు, ఫౌంటేన్లు
ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన ఫౌంటేన్లు, పార్కులు నగర వాసులను ఆహ్లాదపరుస్తున్నాయి. లకారం ట్యాంక్బండ్ వద్ద పార్కు ఎంతగానో ఆకట్టుకుంటున్నది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సాయంత్రం వేళ ఇక్కడ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇల్లెందు క్రాస్రోడ్డు, కాల్వొడ్డు, మమత రోడ్డులోని లకారం పార్క్ వద్ద ఫౌంటేన్లు ఆకట్టుకుంటున్నాయి. నీటి అందాలు వెలుగుల కాంతుల మధ్య ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు సైతం ఫౌంటేన్ల అందాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందిస్తున్నారు. ఇదికాకుండా ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, తహసీల్దార్ కార్యాలయం తదితర చోట్ల ఉన్న గ్రీనరీలు ప్రజలను ఆహ్లాదపరుస్తున్నాయి. రోటరీనగర్, వ్యవసాయ మార్కెట్, చర్చి కాంపౌండ్, జహీర్పుర తదితర చోట్ల ఉన్న పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. సాయంత్రం వేళల్లో మహిళలు, చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి.
రూ.వెయ్యి కోట్లతో నగరాభివృద్ధి
దాదాపు రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో ఖమ్మం నగరాభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కుతుంది. నగరాలకు దీటుగా ఖమ్మాన్ని ఆవిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నది. నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయించిన సర్కారు, వాటితో అంతర్గత రహదారులు, నిరంతర మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రాతిపదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ తరహాలో ఖమ్మం ఎన్నెస్పీ, మరికొన్ని ప్రాంతాల్లో రూ.10 కోట్లతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను నిర్మించింది.
రూ.23 కోట్లతో కార్పొరేషన్ ఆఫీస్ నిర్మాణం
ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రస్తుత మున్సిపల్ కార్పొ రేషన్ కార్యాలయం రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి పువ్వాడ ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.23 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఇటీవలనే రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
రూ.230 కోట్లతో ఇంటింటికీ నల్లా నీరు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక దృష్టి కారణంగా భగీరథ పనులు ఖమ్మంలో పరుగులు పెడుతున్నాయి. ఫలితంగా ఇంటింటికీ సురక్షిత నీరు చేరుతున్నది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ప్రతిఒక్కరికీ రోజుకు 150లీటర్లు శుద్ధిచేసిన నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.230 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రూ.115 కోట్లను కేటాయించింది. మిగిలిన మరో రూ.115 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఖమ్మంలో ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరాకు అదనంగా రాబోవు 15 ఏండ్లలో ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.