కుటుంబంలో పార్టీ కూడా ఒక భాగమే అని నమ్మారు. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూనే గులాబీజెండాను భుజానికెత్త్తుకున్నారు. నేతల గెలుపు కోసం జేజేలు కొడుతూ నిరంతరం శ్రమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తమవంతుగా పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల్లో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. గులాబీజెండాను గుండెల్లో పదిలం చేసుకున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు వారి పనితీరును ఓర్వలేకపోవడంతో కుటుంబం, పార్టీ బాధ్యతలను వదిలి మృత్యుఒడికి చేరారు. నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన కార్యకర్తలను ఎన్నటికీ మరువమంటూ ప్రమాదబీమాతో భరోసా కల్పిస్తున్నది బీఆర్ఎస్. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.2 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తూ అండగా నిలుస్తున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలనూ వర్తింపజేస్తూ ఆదుకుంటున్నారు. సాయం అందుకున్న బాధిత కుటుంబాలన్నీ సీఎం కేసీఆర్ వైపు చేతులు జోడిస్తున్నాయి. ఆ మహానేతను మరువలేమని, జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని బరువెక్కిన హృదయాలతో చెబుతున్నాయి. 2015 నుంచి ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 116 మందికి, ఖమ్మం జిల్లాలో 220 మందికి బీమా సొమ్ము అందజేశారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)
నా భర్త హెచ్చు వెంకటేశ్వరరావు గత ఏడాది పశువులు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ ప్రవేశపెట్టిన ప్రమాదబీమా రూ.2 లక్షలు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతులమీదుగా అందుకున్నా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించడం వల్ల భర్తను పోగొట్టుకున్న నాకు పార్టీ అండగా నిలిచింది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ నా పిల్లలను చదివించుకుం టున్నా. కుమార్తె శిరీష ఇంటర్, కొడుకు చంటి పదో తరగతి చదువుతున్నాడు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతున్నది. మాకు రూ.2లక్షలు రావడంతో వాటిని కుటుంబ అవసరాలు, పిల్లల చదువుకు ఉపయోగించుకుంటున్నా.
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తూ.. సంక్షేమ పథకాల్లో చోటు కల్పిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమాతో సాయం అందిసున్నది. వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. మైనార్టీ రుణాలు, బీసీలకు బీసీ బంధుతోపాటు ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇంటి స్థలంతోపాటు గృహలక్ష్మి వంటి పథకాలను ఇచ్చి బీఆర్ఎస్ అండగా ఉంటున్నది.
– ఖమ్మం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
/ భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల సాయం అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసున్న మనిషి. అందరి సమస్యలు తెలిసిన నాయకుడు. ఆయన ఆలోచన వల్లే పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు మేలు జరుగుతున్నది. ఏ రాజకీయ పార్టీలు ఇలాంటి సాయం అందించడం లేదు. కేవలం కార్యకర్త మృతిచెందితే కంటి తుడుపు చర్యగా పలకరించి వెళ్లడమే తప్ప వేరే చేసేదేవి ఉండదు.
నా భర్త బర్ల వీరయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ రూ.2 లక్షల ప్రమాద బీమాను నామినీగా ఉన్న నాకు అందించింది. అప్పటికే కుమార్తెకు వివాహం జరిపించగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భర్త మృతిచెందితే వచ్చిన బీమా సొమ్ముతో కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా నిలిచి మాలాంటి నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. భర్త చనిపోయినా పార్టీ, సీఎం కేసీఆర్ చేసిన సాయం నా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది.
మాది అశ్వారావుపేట మండలం పండువారిగూడెం గిరిజన గ్రామం. నాన్న మడివి తమ్మయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బైక్పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నాన్న బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో రూ.2 లక్షల బీమా చెక్కు వచ్చింది. నేను, మా చెల్లి చదువుకుంటున్నాం. నాన్న బీమా డబ్బులతో నేను డిగ్రీ పూర్తి చేశాను. చెల్లి అఖిల బీఎస్సీ నర్సింగ్ 4వ సంవత్సరం చదువుతోంది. అమ్మ లక్ష్మి వార్డు సభ్యురాలిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది. తమ్ముడు కూడా వ్యవసాయ పనులు చేస్తుండు. సీఎం కేసీఆర్ సార్కు, మంత్రి కేటీఆర్ సార్కు మేము రుణపడి ఉంటాం. మళ్లీ సీఎంగా కేసీఆర్ను గెలిపించుకుంటాం.
– మడకం దేవరాజు, పండువారిగూడెం
నా భర్త తాటి నర్సింహారావు నాలుగేళ్ల క్రితం గొందిగూడెం వద్ద వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతిచెందాడు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం కలిగి ఉండడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా పార్టీ బీమా కింద రూ.2 లక్షలు నామినీగా ఉన్న నాకు అందజేశారు. ఇద్దరు కుమార్తెలు కవిత, వెంకటరమణల్లో కవితకు వివాహం చేసి పంపగా.. వెంకటరమణ కుమారుడు ప్రదీప్ల విద్య కోసం, కుటుంబ అవసరాల నిమిత్తం ఈ నగదును ఉపయోగించాను. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి.. మాలాంటి పేదోళ్లను ఆదుకున్న సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రుణపడి ఉంటాం.
– తాటి వీరభద్రమ్మ, ఎలకలగూడెం, అశ్వాపురం మండలం
కాళ్లు, చేతులను నమ్ముకొని బతికే కష్టజీవులం. సుతారి మేస్త్రీగా పనిచేసే నా భర్త ఐదేళ్ల క్రితం స్వామిమాల వేసుకున్నాడు. మున్నేరు వాగులో స్నానం చేయడానికి వెళ్లి కాలుజారి నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఇంటి పెద్దను కోల్పోవడంతో తీవ్ర ఇబ్బందులుపడ్డాం. మా కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న శీలం రవికుమార్ వచ్చి.. మీకు పార్టీ సభ్యత్వం ఉంది.. సీఎం కేసీఆర్ రూ.2 లక్షల సాయం చేస్తారని చెప్పాడు. తర్వాత అతడే హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తీసుకెళ్లి నా పరిస్థితి చెప్పడంతో నా భర్త సభ్యత్వం చూసి నాకు రూ.2లక్షల బీమా చెక్కు మంజూరు చేయించారు. ప్రాణం పోయిన తర్వాత కూడా పార్టీ పట్టించుకుందంటే అది సీఎం కేసీఆర్ గొప్పతనమే. ఇంతకంటే ఏం కావాలి. ఇంత గొప్ప సాయం చేసిన కేసీఆర్ సార్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
-కొట్టె వెంకమ్మ, నాయుడుపేట, ఖమ్మం రూరల్ మండలం
నా భర్త వెంకటేశ్వర్లు 2019 అక్టోబర్లో అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. సభ్యత్వ నమోదు రశీదును ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్కు సమర్పించగా.. ఆమె కృషి వల్ల మాకు అక్టోబర్, 2020లో రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు వచ్చింది. కార్యకర్తలు మృతిచెందితే ఆర్థిక సాయం చేసి చేతులు దులిపేసుకున్న పార్టీలను చూశాను కానీ.. కార్యకర్త మృతిచెందిన తర్వాత కూడా వారి కుటుంబానికి ప్రమాద బీమా రూ.2 లక్షలను అందించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెబుతున్నా. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి లిఖిత ఇంటర్ ఫస్ట్ ఇయర్, రెండో అమ్మాయి పదో తరగతి చదువుతోంది. నా భర్త మృతిచెందిన తర్వాత భారం అంతా నాపైనే పడడంతో దిక్కుతోచని స్థితిలో ఉంటున్న తనకు సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ. 2 లక్షలు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడ్డాయి. మా కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు కోటి ధన్యవాదాలు.
నా భర్త, నేను వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మూడేళ్ల క్రితం నా భర్త లాలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చిన్న పిల్లలు కావడంతో పుట్టెడు అప్పులతో ఉన్న మా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందని స్థానిక నాయకులు వచ్చి చెప్పారు. రూ.2లక్షల బీమా డబ్బులు ఇస్తారని తెలిపారు. వారం రోజులకు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మా ఇంటికి వచ్చి రూ.2లక్షల బీమా చెక్కును అందజేశారు. భర్త మరణించి బాధలో ఉన్న మాకు ఆర్థికంగా.. సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా సాయం చేసిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే హరిప్రియానాయక్కు, బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.
రాజాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం మాది. మా చిన్న కొడుకు శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కోత మిషన్ నడిపేవాడు. రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. 22 ఏళ్ల చేతికొచ్చిన కొడుకు మృతిచెందడం మా కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. కొడుకు లేకపోవడంతో మాకు ఆదెరువు పోయింది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వచ్చి శ్రీకాంత్కు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున బీమా వస్తుందని చెప్పారు. ఆ తర్వాత పార్టీ నుంచి రూ.2లక్షల బీమా సొమ్ము వచ్చింది. ఈ నగదుతో కుటుంబ ఆర్థిక సమస్యలు తీరాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా నిలవడం ఎప్పటికీ మరిచిపోలేం.
కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించే బూర్గంపహాడ్ మండలం కోయగూడెం గ్రామానికి చెందిన సున్నం సైదులు, కుమారి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు శ్రావణ్కుమార్, కుమార్తె పుష్పలత, చిన్న కొడుకు ప్రశాంత్(దివ్యాంగుడు). శ్రావణ్కు రెండేళ్ల క్రితం కృష్ణవేణితో వివాహమైంది. వృత్తి రీత్యా ట్రాక్టర్ డ్రైవర్ అయిన శ్రావణ్ గత ఏడాది డిసెంబర్లో పుల్లలోడుతో ఏటూరునాగారం వైపు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే అతడికి 21 రోజుల కుమారుడు(హన్సిత్ రాజ్కుమార్) ఉన్నాడు. శ్రవణ్ మృతిచెందడంతో ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే శ్రావణ్కుమార్ బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో పార్టీ ప్రమాద బీమా కింద రూ.2 లక్షలను అందజేసింది. పార్టీ బీమా రూ.2 లక్షలు అందుకుని మనుమడు హన్సిత్ రాజ్కుమార్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. మనుమడికి ఆసరాగా బీఆర్ఎస్ పార్టీ బీమా నిలిచిందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ చేసిన సాయాన్ని జీవితంలో మరిచిపోలేం అంటున్నది మృతుడి భార్య కృష్ణవేణి.