ఖమ్మం కల్చరల్/రామవరం, ఏప్రిల్ 21: పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలుస్తోంది రంజాన్. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు ఆయా మసీదుల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈదుల్ ఫిత్ పర్వదినానికి ముందురోజు రాత్రి సప్త ఆకాశాల పైనుంచి భూమండలానికి దేవదూతలు దిగివస్తారు. ఈ రాత్రిని లైలతుల్ జాయిజా అంటారు. నెల రోజులు పాటించిన రోజా, నమాజులు, దానధర్మాలకు గాను దైవదూతలు ప్రతిఫలమిచ్చే రోజు ఇది. ఒక్కో సత్కార్యానికి ఏడు రెట్ల పుణ్యఫలాన్ని లెక్కించి కర్మపత్రంలో లిఖిస్తారన్నది ముస్లింల విశ్వాసం. పండుగ సంతోషాలను చుట్టుపక్కల పేదలతోనూ పంచుకోవాలన్నది అల్లాహ్ సూచన. అందుకే పండుగ నమాజ్ కంటే ముందే పేదలు, అభాగ్యులు, వితంతువులకు ఫిత్రా దానం చేస్తారు. పండుగ సంతోషాలతో వాళ్లను భాగం చేస్తారు. ఫిత్రాలు పంచుతారు. కాబట్టే ఈదుల్ ఫిత్రా అంటారు.
రంజాన్ నెల రోజా రోజులు నిగ్రహాన్ని నేర్పుతాయి. పరోపకారాన్ని బోధిస్తాయి. సానుభూతి తెలియజేస్తాయి. దేవుడు చూస్తున్నాడన్న తలంపును తట్టి లేపుతాయి. కాబట్టే పద్నాలుగు గంటలపాటు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. మహ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ తరపున ఖురాన్ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. జీవన గ్రంథమైన ఖురాన్కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు దేవుడు నెల రోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాన్నది ముస్లింల నమ్మకం. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం లాంటి దుర్గుణాలను త్యజించాలని బోధించేదే రంజాన్ మాసం.
పండుగపూట తెల్లవారుజామునే నిద్ర లేవడం ప్రవక్త సంప్రదాయం. మిస్వాక్ పుల్లతో దంతధావనం చేయాలి. తలంటు స్నానం చేసి అత్తరు పరిమళాలు పూసుకోవాలి. ఈద్నమాజ్కు ముందు తియ్యని పదార్థాన్ని సేవించాలి. లేదంటే బేసి సంఖ్యలో ఖర్చూరాలు తినొచ్చు. ఈద్ నమాజ్కంటే ముందే ఫిత్రాదానం చేయాలి. ఇది ముస్లింల విధి. అప్పుడే పుట్టిన శిశువుకు కూడా పిత్రాను చెల్లించాలి.
ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా విశ్వమానవాళి క్షేమం, శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. ఈ నెలలో ఖురాన్ అవతరించిన సందర్భంగా తరాబీ నమాజులో ఖురాన్ పారాయణం, ఫిత్రా జకాత్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అండగా నిలిచాం. తెలంగాణ ప్రభుత్వం పేదలకు రంజాన్ తోఫాగా దుస్తులు పంపిణీ చేయడంతో వారి కుటుంబాలపై కొంత ఆర్థిక భారం తగ్గినట్లయింది.
-రెహ్మతుల్లా మౌలానా, రుద్రంపూర్ మజీద్ ఏ క్యూబా