మామిళ్లగూడెం, జనవరి 14: ఖమ్మం నడిబొడ్డున 1963లో ప్రారంభమైన కలెక్టరేట్ ఆరు దశాబ్దాల పాటు పాలన అందించింది. ఇప్పటివరకు ఇక్కడి నుంచి 49 మంది కలెక్టర్లు ప్రజలకు పాలన అందించారు. ఈ కలెక్టరేట్లో చివరి కలెక్టర్గా వీపీ గౌతమ్, అలాగే నూతన కలెక్టరేట్లో విధులు నిర్వహించే తొలి కలెక్టర్గా ఆయన చరిత్రలో నిలువనున్నారు. జిల్లాల విభజనకు పూర్వం గార్ల, బయ్యారం, వెంకటాపురం, వాజేడు మండలాలు, ఇప్పుడు ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాలు ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉండేవి. అప్పుడు జిల్లా విశాలమైన విస్తీర్ణంలో ఉండేది. పాత కలెక్టరేట్ నుంచే మొత్తం పాలన సాగేది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లా, వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో విలీనమయ్యాయి. వీటితో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఏడు ముంపు మండలాలూ ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి.
పరిపాలన సౌలభ్యం కోసం 1953 అక్టోబర్ 1న నాటి ఉమ్మడి పాలకులు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపహాడ్, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇదే సంవత్సరం నవంబర్1న జీవి భట్ బాధ్యతలు స్వీకరించారు. 1959లో అప్పటివరకు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని భద్రాచలం రెవెన్యూ డివిజన్ను విడదీసి ఖమ్మం జిల్లాలోనే కలిపారు. కలెక్టరేట్ భవన నిర్మాణానికి 1959 జనవరి 8న ఖమ్మంలో నాటి గవర్నర్ భీమ్సేన్ సచాబ్ శంకుస్థాపన చేశారు. ఐదేండ్ల పాటు నిర్మాణ పనులు సాగాయి. 1963లో భవనం ప్రారంభమైంది. అప్పటి నుంచి అప్రతిహతంగా కలెక్టరేట్ నుంచి ప్రజలకు పాలన అందుతూనే ఉన్నది. ఇక్కడ కలెక్టర్లుగా విధులు నిర్వహించిన వారు కలెక్టర్లు ఆర్బీఐ గవర్నర్లుగా, ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శులుగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. పాత కలెక్టరేట్ నుంచి ఈనెల 17వ తేదీ సేవలు ఆఖరు.
రఘునాథపాలెం మండల పరిధిలోని వీ వీంకటాయపాలెం సమీపంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ను ఈ 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. నూతన కలెక్టరేట్కు 40శాఖలకు సంబంధించిన సామగ్రి, ఫైల్స్ తరలుతున్నాయి. మున్ముందు పాత కలెక్టరేట్ మెడికల్ కళాశాల ఆధీనంలోకి వెళ్లనున్నది.