కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతుల జాబితాలో పొరపాట్లు సరిచేసేందుకు మంగళవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్వహించే ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణ పనులకు 10 మండలాలను తాకుతూ 31 గ్రామాల మీదుగా 1356 ఎకరాల్లో 3371 మంది రైతుల భూములు సేకరించడం జరిగిందని, ఒక్కో ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.22లక్షలు పరిహారం నిర్ధారించగా నోటిఫికేషన్ జారీచేసిన సమయం నుంచి ఇప్పటివరకు వడ్డీ తో కలిపి రైతు ఖాతాలో ఎకరానికి రూ.23లక్షలు జమచేస్తున్నట్లు మధుసూదన్రావు తెలిపారు.
అయితే రైతులకు సంబంధించిన జాబితాలో కొన్ని పొరపాట్లు జరగడంతో వాటిని సరిదిద్దేందుకు ఈ సమావేశం నిర్వహించి రైతులకు పరిహారంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జనవరి నెల చివరివరకు నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవిధంగా చూస్తున్నామని, ఇప్పటికే సత్తుపల్లి మండలం తుంబూరు, సదాశివునిపాలెం,పెనుబల్లి మండలం కోండ్రుపాడు, తల్లాడ మండలం రామానుజవరం గ్రామాలకు పూర్తిస్థాయిలో భూ నిర్వాసితులకు రూ.22కోట్లను పరిహారం నగదు జమచేయడం జరిగిందని స్పష్టం చేశారు.
ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు ఆధునిక పద్ధతిలో 96 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల్లో కోల్పోయిన చెట్లు, పైపులు, రోడ్లకు కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు సర్వే చేయిస్తున్నామని, ఆ సర్వేను త్వరలో పూర్తిచేయిస్తామని రైతులకు తెలిపారు. తొలుత నిర్వాసిత రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ మంగీలాల్, రెవెన్యూ డివిజన్ పరిధిలోని నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.