అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 26: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. మండలంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్వో)తో మాట్లాడుతూ… మృతిచెందిన, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. అనంతరం, స్థానిక కేజీబీవీని సందర్శించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొన్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాంనరేష్, ఆర్ఐ మధు, కేజీబీవీ ప్రత్యేకాధికారి కవిత పాల్గొన్నారు.
అశ్వారావుపేట టౌన్, నవంబర్ 26: ఓటు హక్కు నమోదు దరఖాస్తుల స్వీకరణకు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు మండల ఎన్నికల పర్యవేక్షణ అధికారి, తహసీల్దార్ చల్ల ప్రసాద్ తెలిపారు. మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ శిబిరాలను శనివారం పరిశీలించారు. నవంబర్ 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఓటర్లంతా తమ ఓటుకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట రూరల్, నవంబర్ 26: మండలంలోని ఆసుపాక, తిరుమలకుంట, రెడ్డిగూడెం గ్రామాల్లోని బీఎల్వో కేంద్రాలను అశ్వారావుపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ కంగాల పద్మావతి శనివారం పరిశీలించారు. ఓటు నమోదుపై అవగాహన సదస్సులో మాట్లాడారు. సర్పంచ్లు లింగయ్య, సున్నం సరస్వతి, మహేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు నా రం నాగలక్ష్మి, ఉప సర్పంచ్లు తల్లాడి వెంకటేశ్వరరావు, జుజ్జూరి రాంబాబు, జెట్టి ధర్మారావు పాల్గొన్నారు.