మామిళ్లగూడెం, ఫిబ్రవరి 11: పోలీసుల అదుపులో చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా ఉన్నదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఖమ్మం వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని ముఠాలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాయని, ఆ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని అన్నారు. అసత్య ప్రచారాలను పోస్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎవరైనా ఇలాంటి పోస్టులను వైరల్ చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నగరంలో కిడ్నాప్ అనే కథనం కేవలం అభూతన కల్పన మాత్రమేనని అన్నారు. కిడ్నాప్ గానీ, కిడ్నాప్ యత్నం గానీ జరగలేదని స్పష్టం చేశారు.
కిడ్నాప్ అంటూ వైరల్ సోషల్ మీడియా పోస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారని అన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే విధిగా విచారిస్తామ అన్నారు. అయితే, అందులో భాగంగా నగరంలో అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు విచారిస్తున్న ఒక ఫొటోను కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.