కొత్తగూడెం క్రైం, మార్చి 29: చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి కఠిన శిక్షలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొత్తగూడెం వన్టౌన్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శుక్రవారం ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శిక్షలు కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా రౌడీషీటర్లు ఏదైనా నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, వివాదాల్లో తలదూర్చినా, అల్లర్లు సృష్టించినా, ప్రేరేపించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులను ఆదేశించారు. వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.