మామిళ్లగూడెం, ఏప్రిల్ 15 : షెడ్యూల్ ప్రకారం ఖమ్మం ఎంపీ స్థానానికి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 21న ఆదివారం మినహా మిగతా 7 రోజులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థికి సంబంధించి 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. 26న అదే ఛాంబర్లో స్క్రూట్నీ ఉంటుందని, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉందని తెలిపారు.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై తాజాగా బ్యాంక్ ఖాతాలు తెరవాలని, ఎన్నికలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఈ ఖాతా నుంచే జరపాలన్నారు. అన్ని రకాల అనుమతుల కొరకు సువిధ సింగిల్ విండో ద్వారా 48 గంటల ముందస్తుగా దరఖాస్తు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని, నామినేషన్ స్వీకరణ చెక్ లిస్ట్ అందజేసి, దాని ప్రకారం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జడ్పీ సీఈవో వినోద్, డీటీవో సత్యనారాయణ, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, ఆయా పార్టీల నాయకులు స్వర్ణ సుబ్బారావు, బి.బాలరాజు, జీఎస్ఆర్ఏ.విద్యాసాగర్, వై.విక్రమ్, ఎన్.సత్యంబాబు, చీకటి రాంబాబు, పాలడుగు కృష్ణప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.