ఖమ్మం కమాన్బజార్, మార్చి 23: ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని వామపక్ష నేతలు విమర్శించారు. ప్రశ్నించే వారిని, విపక్ష నేతలను ప్రధాని మోదీ లక్ష్యంగా ఎంచుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం ఆం దోళన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే విపక్షాలపై మోదీ దాడి చేస్తున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రసాద్ తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను రాజకీయ సంస్థలుగా మార్చి బీజేపీ అనుకూల చర్యలు తీసుకునేలా మోదీ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
భవిష్యత్తులో ఏ విపక్ష నాయకుడినీ బీజేపీ ప్రభుత్వం బయట తిరగనివ్వబోదని అన్నా రు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు పోటు ప్రసాద్, ఎర్రా శ్రీకాంత్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, బాగం హేమంతరావు, పోటు కళావతి, సీతామహాలక్ష్మి, మేకల శ్రీనివాసరావు, దొండపాటి రమేశ్, పగడాల మల్లేశ్, తాటి నిర్మల, నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, శ్రావణ్, లక్ష్మణ్, రమేశ్, మీరా, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, మలీదు నాగేశ్వరరావు, సీవై పుల్లయ్య, శిరోమణి పాల్గొన్నారు.