ఇక ముందు జరిగే ఎన్నికల్లో ‘దొంగ ఓట్లకు తావు ఉండకూడదు.. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లకు తావే ఉండొద్దు.. ఒకరి ఓటు మరొకరు వేశారనే ఆరోపణలు రావొద్దు. ప్రజాస్వామ్యానికి కారణభూతమైన ఓటు అమ్మకంలో వస్తువుగా నిలిచిపోవద్దు..’ అనే సంకల్పంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నకి‘లీల’లను ఏరివేస్తున్నది. ప్రతి ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తున్నది. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, కమ్యూనిటీ సహాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74.83శాతం పూర్తయింది. వచ్చే నెల చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– ఖమ్మం, అక్టోబర్ 21 (సమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 21 (సమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతేక్యక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరి ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేస్తున్నది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన ప్రక్రియ ప్రస్తుతం వేగాన్ని పుంజుకున్నది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని 1,416 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం ఓటర్లు 11,20151 మంది ఉండగా ఇప్పటివరకు 8,35,706 మంది ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయి 74.83శాతం నమోదైంది. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉండగా అత్యల్పంగా వైరా నియోజకవర్గంలో ఉన్నారు.
నిరంతరం పర్యవేక్షణ..
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని బూత్ లెవల్ అధికారులు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ఆధార్ నంబర్లను తీసుకుని ఫాం-బిలో సంతకం చేయిస్తున్నారు. వచ్చే నెల రెండో వారంలోపు ప్రక్రియ పూర్తి చేసేందకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, కమ్యూనిటీ సహాయకులు భాగస్వాములు అవుతున్నారు. వీరు ఓటర్ల జాబితాలో అవకతవకలను గుర్తిస్తున్నారు. డబుల్ ఓటర్లను తొలగిస్తున్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా ప్రక్రియకు సహకరిస్తున్నారు.
వేగవంతంగా ఆధార్ అనుసంధానం
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేస్తున్నాం. ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నాం. మండలాల్లో తహసీల్దార్లు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసేందుకు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మండల అధికారులు రోజువారీ వివరాలు సేకరిస్తున్నారు.
– ఎన్.మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం