‘ప్రగతి రథ చక్రాలు నిరంతరం పరుగులు పెడతాయి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకే టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం.. పట్టుబట్టి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చర్యలు తీసుకున్నాం. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. మంత్రిగా నేను రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సంస్థ విలీనంతో 43 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి.. సీఎం కేసీఆర్ కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూస్తారు. అలాగే ఖమ్మం నగరంలోని మున్నేటికి ఇరువైపులా రూ.150 కోట్లతో ఆర్సీసీ వాల్ నిర్మిస్తాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం తర్వాత మొదటిసారి సోమవారం ఖమ్మం వచ్చిన మంత్రికిమున్నేరు ముంపు బాధితులు, ఆర్టీసీ ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాల్వొడ్డు వద్ద ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ విలీనంతో కార్మికులకు ఉద్యోగ భద్రత వచ్చిందన్నారు.
– ఖమ్మం, ఆగస్టు 7
ఖమ్మం, ఆగస్టు 7:ప్రగతి రథ చక్రాలు ఇక ఎప్పటికీ ఆగబోవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అవాంతరాలు ఎదురైనా పట్టుబట్టి జట్టు కట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకున్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం బిల్లును అటు అసెంబ్లీలోనూ, ఇటు మండలిలోనూ తాను ప్రవేశపెట్టడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. తన ద్వారా బిల్లును పెట్టించి 43 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టి చూసుకుంటారని అన్నారు.
రూ.150 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత మొదటిసారి ఖమ్మం వచ్చిన సందర్భంగా మంత్రి అజయ్కుమార్కు మున్నేరు ముంపు బాధితులు, ఆర్టీసీ ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు. త్రీటౌన్ ప్రజలు, కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని, అందుకు ప్రతి కార్మికుడూ ఆయనకు రుణపడి ఉండాలని అన్నారు. ఆర్టీసీలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని, ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు వస్తాయని వివరించారు. తాను మంత్రిగా అయిన రోజు నుంచి ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నానని అన్నారు. ఇకముందు కూడా వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మున్నేరు వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం..
ఖమ్మం మున్నేరుపై తీగల బ్రిడ్జి నిర్మాణం కోసం ఇప్పటికే రూ.180 కోట్లు మంజూరయ్యాయని, తాజాగా మున్నేరు ముంపు నుంచి రక్షణ కోసం మరో రూ.150 కోట్లు మంజూరయ్యాయని మంత్రి అజయ్ వివరించారు. ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం పూర్తయితే మున్నేరు వరదల ముప్పు నుంచి దాని పరీవాహక ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకడా రాజీ పడదని స్పష్టం చేశారు. తాను మంత్రినయ్యాక ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారీ కేసీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనకు అండగా నిలిచారని, రూ.వందల కోట్ల గ్రాంట్లు మంజూరు చేసి ప్రోత్సహించారని అన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. అందుకు ఖమ్మంలోని అన్ని వర్గాల ప్రజలూ అండగా నిలవాలని కోరారు. జిల్లాలో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాల్సిన బాధ్యత మంత్రిగా తనపై ఉందని అన్నారు. కాబట్టి ఖమ్మంలో తన తరఫున ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో కాల్వొడ్డు నుంచి మయూరిసెంటర్, జడ్పీసెంటర్ మీదుగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
మున్నేరు ముంపులో ఇక గజం స్థలానికీ నష్టం రాదు
మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ వాల్ నిర్మాణం జరిగితే గజం స్థలం కూడా పోదని, ఇండ్లేవీ పోవని, అసలు బఫర్ జోనే ఉండదని మంత్రి అజయ్కుమార్ అన్నారు. అందుకని పరీవాహక ప్రజలు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నందున తలలు నిమిరే వారు, బుగ్గలు గిల్లేవారు వచ్చి మాయ మాటలు చెబుతారని అన్నారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మున్నేరు వరదల సమయంలో తాను బురదలో ఉన్న విషయాన్ని చూసి చలించిన తన కోడలు.. మున్నేరు బాధితుల కోసం రూ.50 లక్షలు విరాళం ఇచ్చిందని గుర్తుచేశారు. వాటిని కలెక్టర్ ఖాతాలో జమ చేశామని మంత్రి అన్నారు.
రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి కూడా రూ.కోటిని కలెక్టర్ ఖాతాకు బదిలీ చేశారని అన్నారు. మున్నేరు వరద వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేలకు తగ్గకుండా స్థానిక కార్పొరేటర్ల అధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అందిస్తామని అన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీసీసీబీ, సుడా, ఏఎంసీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, దాదే ఆమృతమ్మ సతీశ్, తోట ఉమా వీరభద్రం, పసుమర్తి రామ్మోహన్, దోన్వాన్ సరస్వతి రవినాయక్, తోట గోవిందమ్మ రామారావు, మాటేటి అరుణ నాగేశ్వరరావు, మాటేటి కిరణ్కుమార్, అశ్రీఫ్, రుద్రగాని కమల, గజ్జల లక్ష్మి వెంకన్న, తాజుద్దీన్, బత్తుల మురళి, పొన్నం వెంకటేశ్వర్లు, తన్నీరు శోభారాణి, మడూరి ప్రసాద్, కొల్లు పద్మ, షకీనా, నున్నా మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.