సరిగ్గా ఇదే డిసెంబర్ నెల.. రాత్రివేళ ఓ చెట్టుకింద ముసలవ్వ చలికి వణుకుతున్నది. ఆ సీన్ చూసి చలించిపోయారు నలుగురు యువకులు. ఇటువంటి అభాగ్యులు, అనాథలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ చేతనైన సాయం చేయాలని మరో 8 మంది స్నేహితులతో కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రూ.4 లక్షలు కూడబెట్టి దాని వడ్డీతో బాధితులకు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇతరుల్లో స్ఫూర్తి రగిలిస్తున్నారు. 14 ఏండ్లుగా పరులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిధి చిన్నదే కావచ్చు.. కానీ పదిమందికి సహాయం చేయాలనే వారి ఆశయం గొప్పది. చిమ్మచీకట్లో చిరుదీపం వెలిగించిన ‘అమ్మ’ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలుసుకుందాం.
ఇల్లెందు, డిసెంబర్ 17 : అనాథలు, అభాగ్యులకు సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఇల్లెందు పట్టణానికి చెందిన చిరు వ్యాపారులు. 2008 సంవత్సరంలో పట్టణంలోని కొత్తబస్టాండ్ సమీపాన ఓ చెట్టుకింద ఇదే నెలలో చలికి వణుకుతున్న అభాగ్యురాలిని చూసి వారు చలించిపోయారు. మనకు ఉన్నదాంట్లో కొంతైనా కూడబెట్టి పరులకు సాయపడాలని ఆ రోజే నిశ్చయించుకున్నారు. 12 మంది స్నేహితులు కలిసి ‘అమ్మ’ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ను 2009లో ఏర్పాటు చేశారు. ప్రతి సభ్యుడు రోజు రూ.300 జమచేస్తూ రూ.4 లక్షల నిధిని సమకూర్చారు. దానినుంచి వచ్చే వడ్డీ డబ్బుల ద్వారా పదిమందికి సాయపడాలని నిర్ణయించుకున్నారు. పబ్లిసిటీకి దూరంగా ఉంటూ గత 14 ఏండ్లుగా ఎంతోమందిని ఆదుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తాళిబొట్లు, పెళ్లి అవసరాలకు ఆర్థిక సాయం అందించారు. ఓ ఆటో డ్రైవర్ కూతురు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే ఆదుకున్నారు. ఏజెన్సీలో ప్రజలు సీజనల్ వ్యాధులతో సతమతమవుతుంటే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు కావాల్సిన వస్తువులు అందించారు. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పేదింటి ప్రజలకు డబ్బులిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అంగన్వాడీ పాఠశాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. రోడ్లపై యాచకులను గుర్తించి దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నోట్ పుస్తకాలు, ఫ్యాడ్లు, పెన్నులిచ్చారు. మంచి మార్కులొస్తే బహుమతులందించి ప్రోత్సహించారు. కరోనా సమయంలో అనేక మందికి నిత్యావసర సరుకులు, కరోనా కిట్లు, కూరగాయలు అందించి భరోసా కల్పించారు. గోదావరి పుష్కరాల సమయంలో అన్నదానం, పట్టణంలో పౌరులకు బల్లాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో మొక్కల పంపిణీ, నాటడం.. ఇలా అనేక విషయాల్లో వందల మందికి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ సాయం అందించి ఇతరుల్లో స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
తమకున్న దాంట్లో నుంచి కొంతైనా ఇతరులకు సాయం చేయాలనుకుంటున్న ఆ యువకులు సమాజంలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. రోజువారీ అనవసర ఖర్చులు చేస్తున్న అనేకమందికి భిన్నంగా వారు ప్రతిరోజు కొంత డబ్బు జమ చేస్తున్నారు. వారిని ఎవరు సంప్రదించినా ఇప్పటివరకు కాదనలేదు. బాధపడుతున్న వారి వివరాలు తెలిసినా అక్కడకు చేరుకొని చిరు సహాయాలు చేస్తున్నారు. ఇలా పలువురిని ఆదుకుంటున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వాన్ని బతికిస్తున్నారు.
మేము సాయం అందించిన వాటిలో ఎక్కువ భాగం విద్య, వైద్యానికి సంబంధించినవే. విద్య, వైద్యరంగాన్ని మెరుగైన రీతిలో పూర్తిగా ఉచితంగా అందిస్తే పేదలకు ఇక్కట్లు తప్పుతాయి. మాకు చేతనైనంత సాయం అభాగ్యులకు చేస్తూనే ఉంటాం.
2008లో ఓ ముసలమ్మను చూసి నలుగురం స్నేహితులం చలించిపోయాం. మరో 8 మందిని కలిసి విషయం చెప్పాం. వారు కూడా ఒప్పుకోవడంతో 12 మందితో ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దిక్కులేని వృద్ధులకు ముందుగా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. పట్టణంలో అన్నిచోట్ల తిరిగి కంటికి కనిపించిన వారికి సహాయం చేయడం ప్రారంభించాం.
సహాయం చేయడానికి ఏ వేదిక అక్కర్లేదు. ఎవరికి తోచిన సాయం వారికి తగ్గట్టు చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి. ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నవారిని ఆదుకొని మానవత్వం చాటుకుంటే చాలు. ఒకరిని చూసి మరొకరు ఇలా అందరు ఆ దిశగా నడవాలి. అలా చేస్తే జీవితంలో కొంతైనా తృప్తి మిగులుతుంది.