ప్రమాదాన్ని పసిగట్టలేం.. కనీసం ఊహించలేం.. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తోందో తెలియదు.. ఏమరుపాటు నిండు జీవితాన్నే బలి తీసుకుంటుంది. అందుకే, వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త.. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి.. కారు, ఇతర వాహనాల్లో వెళ్తున్నప్పుడు సీటు బెల్టు ధరించండి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. విలువైన ప్రాణాలను కాపాడుకోండి..
రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాద దృశ్యాలు కలిచివేస్తున్నాయి. నూటికి 95శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని తేలింది. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలు నడపటం, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని,ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ.. ఇలా కారణమేదైనా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నేటికీ ఇలాంటి సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. వాహనదారులు మార్పు దిశగా అడుగేయడం లేదు.. విలువైన జీవితాలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకే, భద్రాద్రి జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణకు కంకణం కట్టుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. వాహనచోదకుల్లో మార్పు తీసుకొస్తున్నారు.
– కొత్తగూడెం క్రైం, మార్చి 4
కొత్తగూడెం క్రైం, మార్చి 4: కొందరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు.. మరికొందరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలనే కాక తోటి వాహనదారుల ప్రాణాలనూ బలిపెడుతున్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. నిత్యం భద్రాద్రి జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటున్నది. ఇంటిని పోషించేవారి మరణాలు సంభవించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మిగిలిపోయిన వారూ ఉన్నారు. ద్విచక్రవాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడే వారిలో ఎక్కువ మంది హెల్మెట్ వాడని వారే ఎక్కువమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు యువత ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారందరి వాహనాలపై పోలీస్శాఖ చలాన్లు వేస్తున్నది. రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమించిన ప్రతిఒక్కరి నుంచి జరిమానా వసూలు చేస్తున్నది.
పోలీస్శాఖ పటిష్ట నిఘా..
భద్రాద్రి ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు సబ్డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలను కఠినతరం చేశారు. మున్సిపాలిటీల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వ్యవస్థను పటిష్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ను పునరుద్ధరించారు.
మూడేళ్లలో రూ.7 లక్షల కేసులు..
జిల్లాలో గడిచిన మూడేళ్లలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై 7,07,914 కేసులు నమోదు చేశారు. వారికి రూ.15.04 కోట్ల జరిమానా విధించారు. 2021లో హెల్మెట్ ధరించని వారిపై 3,20,930 కేసులు నమోదు చేశారు. రూ.5,60,40,700 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై 2,211 కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై 10,733 కేసులు నమోదు చేశారు. రూ.1,28,79,600 జరిమానా విధించారు. వేగంగా వాహనాలు నడిపే వారిపై 3,845 కేసులు నమోదు చేసి రూ.38,45,000 జరిమానా విధించారు. రాంగ్ రూట్లో వాహనం నడిపిన వారిపై 5,637 కేసులు నమోదు చేసి రూ.61,99,800 జరిమానా విధించారు. 2022లో హెల్మెట్ ధరించని వారిపై 2,97,052 కేసులు నమోదు చేసి రూ.4,95,57,400 జరిమానా విధించారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 12,608 కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్పై 7,788న కేసులు నమోదు చేసి రూ.93,45,600 జరిమానా విధించారు. అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై 3,185 కేసులు నమోదు చేశారు. రూ.31,85,000 జరిమానా విధించారు. రాంగ్ రూట్లో నడిపిన వారిపై 2,487 కేసులు నమోదు చేశారు. రూ.17,70,400 జరిమానా విధించారు. ఈ ఏడాది ఒక్క ఏడాదిలోనే ఫిబ్రవరిలోనే హెల్మెట్ ధరించని వాహనదారులపై 38,331 కేసులు నమోదు చేశారు. రూ.65,49,500 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిపై 1,970 కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడ్ చేసిన వారిపై 727 కేసులు నమోదు చేసి రూ.8,72,400 జరిమానా విధించారు. అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై 99 కేసులు నమోదు చేశారు. రూ.99 వేల జరిమానా విధించారు. రాంగ్ రూట్లో నడిపే వాహనదారులపై 311 కేసులు నమోదు చేసి రూ.65,200 జరిమానా విధించారు.
జాగ్రత్తగా వాహనం నడపాల్సిందే..
కొందరు వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. తాము ప్రమాదాల బారిన పడడంతో పాటు ఇతరులనూ ఇబ్బంది పెడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్పై అందరికీ అవగాహన ఉండాలి. జరిమానా తప్పించుకోవాలంటే నిబంధనలు పాటించాల్సిందే.
– గంగారపు రోహిత్, డిగ్రీ విద్యార్థి, కొత్తగూడెం
హెల్మెట్ ధరించే బండి నడుపుతాను..
నేను నిత్యం పాల్వంచ నుంచి కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి పీవీకే 5 షాఫ్టులో పనిచేసేందుకు వెళ్తాను. ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరిస్తాను. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డు ప్రమాదాలకు తావు లేని సమాజ నిర్మాణం కోసం పోలీస్శాఖ పనిచేస్తున్నది. పోలీసులకు ప్రజలందరూ సహకరించాలి.
– రాధాకృష్ణ, సింగరేణి ఉద్యోగి
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదు..
ప్రతి వాహనదారుడూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్పై పోలీస్శాఖగా సీరియస్గా ఉంది. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. వాహనదారుల భద్రత కోసమే పోలీస్శాఖ పనిచేస్తున్నది. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
– డాక్టర్ వినీత్ గంగన్న, భద్రాద్రి ఎస్పీ