భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ జ్వరాలను అదుపులో ఉంచడంలో కృషి చేస్తున్నారు. జనవరి నుంచి జిల్లాలో 93 మలేరియా కేసులు, 139 డెంగీ కేసులు నమోదయ్యాయి. గతంతో పోల్చితే తక్కువే అయినప్పటికీ మలేరియా, డెంగీ జ్వరాలను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
జ్వరం ఏదైనా రక్త నమూనాలే ముఖ్యం
సీజన్లో ఎలాంటి జ్వరం వచ్చినా రక్త నమూనా తీసుకోవడమే లక్ష్యంగా వైద్యసిబ్బంది ముందుకెళ్తున్నారు. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 3లక్షల మందికి రక్త నమూనాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 1.64 లక్షల మందికి సేకరించారు. ఇందులో 139 డెంగీ కేసులు, 93 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో డెంగీ లక్షణాలు ఉన్న 6,500 మంది శాంపిల్స్ ఎలీసా పరీక్షలు చేశారు.
దోమల మందు పిచికారీ
నీటి నిల్వలో గుడ్లు పెడుతున్న దోమల వల్ల మలేరియా వ్యాప్తి జరుగకుండా వైద్యశాఖ ముందస్తు చర్యలు చేపడుతున్నది. జిల్లాలో 249 గ్రామాల్లో ఇప్పటికే మొదటి దఫా దోమల మందును పిచికారీ చేశారు. ఆగస్టు 15 నుంచి మళ్లీ అవే గ్రామాల్లో రెండోవిడత దోమలమందు పిచికారీ చేయనున్నారు. గత ఏడాదిలో సీజన్కు మొత్తంగా 256 మలేరియా కేసులు నమోదయ్యాయి.
ప్రైవేటులో డెంగీ పరీక్షలు వద్దు..
ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ పరీక్షలు చేయించుకోవడం వల్ల పాజిటివ్ పేరుతో స్టెరాయిడ్స్ వాడతారని, దీనివల్ల ప్లేట్లెట్స్ పడిపోయి మరణాలకు కారణమవుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కేవలం ఎలీసా పరీక్ష ద్వారానే డెంగీ నిర్దారణ చేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రైవేట్లో స్ట్రిప్ పద్ధతిలో ఎన్ఎస్-1లో పాజిటివ్ వస్తే దానిని డెంగీ కింద చూపించి మందులు అతిగా వాడిస్తున్నారు. అందువల్ల జ్వరం వచ్చిన రోగి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రాన అది డెంగీ కాదని చెబుతున్నారు.
ఇంటి ఆవరణలో నీటి నిల్వలు
వానకాలం.. ఎండాకాలం అనికాకుండా ప్రతి ఇంట్లో వ్యర్థ పదార్థాల ద్వారా నీటి నిల్వ ఉంటుంది. వాడిన వాటర్బాటిల్స్, కొబ్బరి బొండాలు, పగిలిన కుండలు, టైర్లలో నీరు నిలిచి పోవడంతో దోమలు గుడ్లు పెడుతున్నాయి. వేసవిలో కూలర్లు, ఫ్రిజ్ వెనుక భాగంలో దోమలు పెరుగుతున్నాయి. వీటన్నింటిని అదుపు చేయడానికి వారానికి రెండ్రోజులు డ్రైడే పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వలను గుర్తించి పారబోయిస్తున్నారు.
జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
జ్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రక్త నమూనాలు తీయించుకుని పరీక్ష చేయించుకోవాలి. మందులు జాగ్రత్తగా వాడాలి. ప్రైవేటులో రక్త పరీక్షలు తీయించుకోవద్దు. డెంగీ టెస్టు వాళ్లవద్ద లేదు. దాని వల్ల ప్లేట్లెట్స్ పడిపోయే ప్రమాదం ఉంది. మండల, గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వలసవచ్చిన వాళ్లకి ప్రతి ఏటా మలేరియా ఉంటుంది. వాళ్లకు కరిచిన దోమలు ఇతరులకు కరిస్తే జ్వరాలు వచ్చి మలేరియా సోకుతున్నది. అందుకే ఆ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయిస్తున్నాం.
– డాక్టర్ శిరీష, డీఎంహెచ్వో