దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారీ ర్యాలీలు, కోలాట బృందాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొన్నది. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి దినోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు జలహారతి పట్టారు. సాగునీటి వనరులు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములునాయక్, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్లో మున్నేరు చెక్డ్యామ్ వద్ద జరిగిన వేడుకలకు ఎమ్మెల్సీ తాతా మధు, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.
– మస్తే నెట్వర్క్, జూన్ 7
ఖమ్మం, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ః రాష్ర్టాన్ని సాగునీటి రంగంలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, గడిచిన తొమ్మిదేళ్లల్లో 71 ప్రాజెక్ట్లను నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం సాగునీటి దినోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఎండిపోయేవని కానీ నేడు తెలంగాణలో మిషన్ కాకతీయతో వాటిని అభివృద్ధి చేయడంతో ఎక్కడ చూసిన నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1200 చెక్డ్యాములను నిర్మించామన్నారు. 2014కు ముందు ఎలా ఉండేదో రైతులకు తెలుసని, 2014 తరువాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అన్నదాతలకు తెలుసన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.
అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 1 వద్ద జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ విప్ రేగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామా ప్రాజెక్ట్, సీతమ్మ బ్యారేజీలు జిలాలకు తలమానికంగా నిలిచాయన్నారు. అతి త్వరలోనే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. కల్లూరు పట్టణలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించి నేడు దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని అన్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్న పాలకులు నేడు తెలంగాణలో రైతులు వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటున్నారన్నారు. వైరా పట్టణంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములునాయక్ పాల్గొన్నారు.
భారీ ట్రాక్టర్ ర్యాలీ, కోలాట బృందాలు, సంప్రదాయాలతో సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ డప్పు వాయిస్తూ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. మధిర పట్టణంలోని రైతువేదికలో ఐబీ ఈఈ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సాగునీటి దినోత్సవంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. సాగునీటి రంగంలో నేడు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సాగునీటి దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
ముందుగా జ్యోతిప్రజలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరారవు మాట్లాడుతూ.. సాగునీటి రంగం అబివృద్ధిపైనే తెలంగాణ పునర్నిర్మాణం ఆధారపడి ఉందని గ్రహించిన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీతారామా, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను నిర్మింస్తుందని అన్నారు. దమ్మపేట మార్కెట్ యార్డులో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దే అని అన్నారు. ఇల్లెందు మండలంలోని ఇల్లెందులపాడు చెరువుకట్ట వద్ద నిర్వహించిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ.. ప్రతీ నీటి బొట్టును సీఎం కేసీఆర్ ఒడిసిపట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడుకలోకి తీసుకువస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రశంసలను అందుకున్నారన్నారు.