భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి రామయ్యను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన భక్తులకు పాట్లు తప్పలేదు. సెక్టార్లలో వందలాది మంది భక్తులు నించునే స్వామివారిని దర్శించుకున్నారు. సెక్టార్లకు నియమితులైన అధికారులెవరూ అక్కడ కనిపించకపోవడంతో భక్తులు ఎవరికి ఫిర్యాదు చేయాలో పాలుపోక ఇబ్బంది పడ్డారు. కొందరు సెక్టార్ల వద్దకు కూడా రాలేకపోయారు. ఏటా ముక్కోటికి వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు రావడం కొంచెం హడావుడి ఉండేది. కానీ ఈసారి మంత్రైనా వేడుకకు హాజరు కాలేదు. మీడియాకు కేటాయించిన సెక్టార్లోకి సైతం ఇతరులు రావడంతో మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విధుల్లో ఉన్న కొందరు తమకు సంబంధించిన వ్యక్తులను నిబంధనలకు వ్యతిరేకంగా గ్యాలరీలు, సెక్టార్లలోకి పంపినట్లు భక్తులు ఆరోపించారు. సౌండ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయకపోవడంతో అర్చకుల వేదమంత్రాలు వినిపించ లేదని, ఏ ఒక్క సెక్టార్లోనూ కనీసం తాగునీటి వసతి కూడా లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల తాకిడి పెరిగినా వారికి సరిపడా సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని పెదవి విరిచారు. ఆలయ పరిధిలోని సౌమిత్రి నిలయంలో కొందరు భక్తులు సౌకర్యాల లేమిపై ఫిర్యాదుల బాక్సులో చీటీలు వేసినట్లు తెలిసింది.