Cyber crime | భద్రాచలం పట్టణానికి చెందిన రవి (పేరు మార్చాం) ఫోన్కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. ‘మీ అకౌంట్ నుంచి రూ.2 వేలు డెబిట్ అయ్యాయి. మీరు డ్రా చేయకపోతే కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి’ అని. వెంటనే కంగారుపడిన రవి.. బ్లూకలర్ లింక్ను ఓపెన్ చేశాడు.. ఫోన్కాల్ వచ్చింది. అవతల నుంచి బ్యాంక్ మేనేజర్ అని చెప్పి, మొబైల్కు వచ్చే ఓటీపీలు చెప్పమని కోరాడు. తనకు మంచి జరుగుతుందని నమ్మిన రవి రెండు మూడుసార్లు మొబైల్ ఓటీపీలు చెప్పాడు. రవి అలా చెబుతుండగానే తన అకౌంట్ నుంచి దాదాపు రూ.10 లక్షల సొమ్మును దోచుకున్నాడు సైబర్ దొంగ.
ఉన్నట్టుండి మీ మొబైల్కు ఓ కాల్ వస్తుంది.. ‘మీకు బంపర్ ఆఫర్ వచ్చిందండీ..’ అని ఊరిస్తాడు.. లేదా ‘రూ.10 లక్షల లాటరీ వచ్చింది.. మీరు మా ఖాతాలో ఫలానా అమౌంట్ జమ చేస్తే వెంటనే రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాం’ అని ముగ్గులోకి దింపుతాడు.. లేదా ‘నేను బ్యాంక్ మేనేజర్ని.. మీ లావాదేవీలు సరిగా లేవు మీ ఖాతాను బ్లాక్ చేస్తున్నాం..’ అని బెదిరిస్తాడు.. లేదా ‘ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్ని.. మీరు ట్యాక్స్ పే చేయాలి..’ అని అమాయకులైన వ్యాపారులను టార్గెట్ చేస్తాడు.. వాడే సైబర్ దొంగ..! వాడి చేతికి మన వివరాలు దొరికాయంటే నిమిషాల్లో మన సొమ్ము గల్లంతే.. అసలు ఇలాంటి నేరాలు ఎలా జరుగుతాయి..? నేరగాళ్లకు మన సమాచారం ఎలా తెలుస్తుంది..? మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
– కొత్తగూడెం క్రైం, మే 5
కొత్తగూడెం పట్టణానికి చెందిన వనజ (పేరు మార్చాం) చిట్టీలు నడిపిస్తుంటుంది. ఇటీవల ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి.. ‘మీ మొబైల్ నంబర్కు రూ.10 లక్షల లాటరీ తగిలింది’ అని చెప్పాడు. దీంతో ఎగిరి గంతేసిన వనజ డబ్బులు తన ఖాతాలోకి రావాలంటే ఏం చేయాలని అమాయకంగా అడిగింది. ఆ అజ్ఞాతవ్యక్తి మెల్లిగా ఆమెను మాటల్లోకి దించి.. బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్టు, సీవీవీ, పిన్ నంబర్లు తెలుసుకొని ఆమె అకౌంట్ నుంచి దాదాపు రూ.లక్ష సొమ్ము కాజేశాడు. తీరా ఈ విషయం తెలిసి లబోదిబోమన్నది వనజ. ఇలాంటి ఘటనలెన్నో భద్రాద్రి జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్నాయి.. అందుకే తస్మాత్ ప్రజలారా..! అప్రమత్తంగా ఉండండి..
కొత్తగూడెం క్రైం, మే 5 : సైబర్ నేరాలు నానాటికీ పెరగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడేది ఎక్కువగా అంతర్రాష్ట్ర ముఠాలే. వీరు ప్రధానంగా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాదారుల వివరాలను సేకరించి, మాయమాటలతో బ్యాంక్, కస్టమ్స్ అధికారులమని, మీకు బహుమతులు వచ్చాయని తెలివిగా ఖాతాదారులను నమ్మిస్తారు. అమాయకులను నమ్మించి బ్యాంక్ ఓటీపీలు తెలుసుకుని సొమ్మును నిలువునా దోచుకుంటున్నారు. ఇటీవల అన్లైన్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు బాగా పెరిగాయి. ఆర్థిక నేరగాళ్ల చర్యల ఫలితంగా బ్యాంక్ అకౌంట్లోని డబ్బు పోవడంతోపాటు మనశ్శాంతి కరువవుతున్నది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తమ సొమ్మును రాబట్టుకోలేక పోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, అశ్లీల చిత్రీకరణ, కించపర్చే సందేశాలు, అభ్యంతరకర దృశ్యాలు, వీడియో, కిడ్నాప్ తదితర నేరాలను సైబర్ నేరాలుగా పోలీసులు పరిగణిస్తున్నారు.
బంపర్ ఆఫర్లను నమ్మకండి..
నేరాగాళ్లు కొందరికి ఫోన్ చేసి బ్యాంక్ నుంచి మేనేజర్ ఫోన్ చేసినట్లు పేర్కొంటూ ఏటీఎంల పాస్వర్డ్, పిన్కోడ్లు అడిగి మరీ తీసుకుంటున్నారు. మోసం గురించి తెలియక కొందరు వివరాలను చెపుతూ మోసపోతున్నారు. మరికొందరు కేటుగాళ్లు ‘మీ ఎకౌంట్లో కొంత మొత్తం జమయ్యాయి.. మీరు ఫలానా లింక్ను ఓపెన్ చేయండి..’ అంటూ మెసేజ్ పంపుతుంటారు. లింక్ ఓపెన్ చేసి వినియోగదారుడి ఖాతాలోని వివరాలను తెలుసుకుంటున్నారు. కాబట్టి బంపర్ ఆఫర్లు అని వచ్చే ఫేక్ మెసేజ్లకు సంబంధించిన లింక్లు ఓపెన్ చేయకపోవడమే మంచిది. ఆధీకృత వెబ్సైట్స్, మెసేజ్లకు మాత్రమే స్పందించాలి..
‘ఓఎల్ఎక్స్’ మోసాలు ఇలా..
వాహనాలకు సంబంధించి ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లలో వివరాలను పొందుపర్చి ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించి కూడా మోసం చేస్తున్నారు. కొనుగోలుదారునిలోని ఆసక్తిని గమనించి మొదట తమ ఖాతాలో డబ్బులు వేసిన వారికే వాహనాన్ని ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. వివరాలు తీసుకోవడంతో పాటు కొంత మొత్తాన్ని పలానా ఖాతాలో వేయమంటూ ప్రోత్సహిస్తున్నారు. వాహనం తక్కువ రేటుకు వస్తుందనే యోచనలో వినియోగదారులు కేటాగాళ్లను నమ్మి మోసపోతున్నారు. వినియోగదారుల నుంచి సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ కోడ్), ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) వంటి ఫోన్ ద్వారా సేకరించేందుకూ సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.
ఫేస్బుక్ టార్గెట్గా..
సైబర్ నేరాలకు నేరగాళ్లు ఫేస్బుక్ను ఆధారం చేసుకుంటున్నారు. అప్పటికే ఉన్న ఐడీపై ఫేక్ ఐడీలు సృష్టిస్తున్నారు. అసలు ఐడీలో వివరాలను ఆ ఫేక్ ఐడీలో ఉంచుతున్నారు. ఫొటో కూడా సేమ్ టు సేమ్ పెడుతున్నారు. ఒరిజినల్ వ్యక్తి ఖాతాలో స్నేహితులుగా ఉన్న వారందరికీ మెసెంజర్, వాట్సాప్ ద్వారా డబ్బులు కావాలని మెసేజ్ చేస్తున్నారు. అందినకాడికి డబ్బు దోచుకుంటున్నారు. ఇంకొందరు కేటుగాళ్లు ఇన్కం ట్యాక్స్ సైట్లోకి వెళ్లి డూప్లికేట్ పాన్కార్డు, మొబైల్ నంబర్ సంపాదిస్తున్నారు. అనంతరం మోసాలకు ప్రధాన వనరైన ఫోన్ నంబర్ కోసం తన ఫోన్ నంబర్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ డూప్లికేట్ పాన్ కార్డు ద్వారా మొబైల్ కంపెనీ నుంచి మరో సిమ్కార్డ్ పొందుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా మన అకౌంట్ను తను తన ఆధీనంలోకి తీసుకుంటారు. సైట్లోకి వెళ్లిన తర్వాత పాస్వర్డ్ మర్చిపోయానంటూ కొత్త పాస్వర్డ్ను క్రియేట్ చేసుకొని సులభంగా డబ్బులు కొల్లగొడతారు. అసలైన ఖాతాదారు తన ఖాతాలోని డబ్బులు డ్రా అవుతున్నట్లు గుర్తించే లోపై రూ.లక్షల్లో డబ్బు లాగేస్తున్నారు.
జిరాక్స్ సెంటర్ల కేంద్రంగా..
మనం పాన్కార్డో, ఐడీకార్డో, బ్యాంక్ ఖాతా పుస్తకమో, ఆధార్ కా ర్డో.. ఇలా ఏదో ఒక అవసరం పడి జిరాక్స్ తీయిస్తాం. కొన్నిసార్లు వాటిని స్కానింగ్ కూడా తీయిస్తాం. దీంతో నిర్వాహకులకు మన విలువైన సమాచారం లభిస్తున్నది. సైబర్ నేరాలకు ఇలా కూడా ఆ స్కారం ఇచ్చిన వాళ్లం అవుతాం.. కాబట్టి జిరాక్స్ సెంటర్లకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. కొందరు జిరాక్స్ కేం ద్రాల నిర్వాహకులకు డబ్బు ఆశ జూపి సైబర్ నేరగాళ్లు ప్రజల విలువైన సమాచారాన్ని లాగుతున్నారనే వదంతులూ లేకపోలేదు. ఒక్కో పేజీకి రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లిస్తున్నారని సమాచారం. నమ్మకమైన సెంటర్లకే వెళ్లి జిరాక్స్ తీయించుకోవడం ఉత్తమమైన మార్గం.
ఏటీఎం సెంటర్లలోనూ..
ఏటీఎం సెంటర్లలోనూ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, అమాయకులు, నిరక్షరాస్యులను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. సాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి ఎటీఎం కార్డులను తస్కరిస్తున్నారు. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు తోడ్పడతామంటూ నమ్మబలుకుతున్నారు. వారి కార్డు ఏటీఎంలో కార్డు పెట్టిన తర్వాత సీక్రెట్ కోడ్ చెప్పమని అడుగుతున్నారు. డబ్బులు రావడంలేదంటూ వినియోగదారుని కార్డును తీసుకొని అప్పటికే వారి వద్ద ఉన్న డూప్లికేట్ కార్డు ఇచ్చి పంపుతున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించి వేరే ఏటీఎంలో డబ్బులు కొల్లగొడతున్నారు.
నేరాల నియంత్రణకు కృషి..
సైబర్ మోసగాళ్ల ఆట కట్టించేందుకు అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. నేరగాళ్లను గుర్తించి బాధితులకు న్యాయం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వినియోగదారులు, బ్యాంక్ ఖాతాదారులు ఓటీపీలు, పాస్వర్డ్, సీక్రెట్ పిన్స్ను ఎవరికీ చెప్పొద్దు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే సమీప పోలీస్స్టేషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఘటన జరిగిన 24 గంటల లోపు ఇస్తే కేసును తొందరగా పరిష్కరించవచ్చు.
– వినీత్ గంగన్న, భద్రాద్రి ఎస్పీ