తిరుమల : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్( Minister Piyush Goya ) శుక్రవారం తిరుమల ( Tirumala ) లోని శ్రీ వేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా వసతి గదుల ఆక్యుపెన్సీ వివరాలు, భక్తుల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల భక్తులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని చెప్పారు.

అంతకుముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. తిరుమలలో తన తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, తదితర అధికారులు పాల్గొన్నారు.