భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట, డిసెంబర్ 21: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లో మరోసారి విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కేసు కూడా నమోదైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ప్రభావం ఊపిరితిత్తులపై అధికంగా ఉంటుందంటూ చెబుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చికిత్సకు అవసరమైన మందులు, ఇంజక్షన్లను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.
కరోనా అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మరణమృదంగం మోగించినప్పుడు బెంబేలెత్తిన జిల్లా ప్రజలు ఈ కొత్త వేరియంట్ విస్తరణ గురించీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో ఏడాది ముగింపు వేడుకలు, ఆ వెంటనే సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఉండడంతో ప్రజలు సమూహంగా ఏర్పడకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, మాస్క్ ధరించడంతోపాటు మరింత పరిశుభ్రతను పాటించాలంటూ, నిత్యం శానిటేషన్ చేసుకుకోవాలంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.
ఒకవేళ కొవిడ్ విస్తరించినా దానిని ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కొన్ని రోజుల క్రితం దేశంలోకి ప్రవేశించిన ఈ కొత్త వేరియంట్ తెలంగాణలోకీ వ్యాపించింది. సుమారు 14 వరకు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. కానీ క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తున్నాయి. కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించడంతో జిల్లా వైద్యాధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 55 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. కొత్త వేరియంట్ కట్టడి కోసం ముందస్తుగా పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
ఈ వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ శరీరంలోకి ప్రవేశిస్తే జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు. రోగనిరోధక శక్తి తగ్గడంతో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నందున ప్రజలు సమూహంగా ఉండకూడదంటూ సూచిస్తున్నారు.
ఒకవేళ కొత్త వేరియంట్ విస్తరించినా ఎదుర్కొనేందుకు వీలుగా వైద్యాధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా దవాఖానాలు, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ఐసోలేషన్ కేంద్రాలను, అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన ఆర్టీపీసీఆర్ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఇంజక్షన్లు సిద్ధం చేసుకుంటున్నారు. లక్షణాలు ఎక్కడైనా ఉంటే వెంటనే నమూనాలు సేకరించి పరీక్షించేలా సన్నద్ధమవుతున్నారు.
కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. కానీ జిల్లాలో ప్రస్తుతం కేసులేమీ నమోదు కాలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా వార్డులను సిద్ధం చేస్తున్నాం. అన్ని పీహెచ్సీల్లోనూ మందులు రెడీ చేశాం. దగ్గు, జ్వరం వచ్చాక కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలిగితే వెంటనే పరీక్షలు చేస్తాం. ఒకవేళ ఆ పరీక్షల నిర్ధారణ అయితే ఐసోలేట్ చేస్తాం. ఇందుకోసం కొత్తగూడెంలో 60, భద్రాచలంలో 30 ఆక్సిజన్ బెడ్లను కూడా సిద్ధంగా ఉంచారు. మిగతా ఆసుపత్రుల్లో కూడా బెడ్లను సిద్ధం చేశాం.
కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ ఉండాలి. మాస్కులు ధరించాలి. రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దు. బలవర్ధమైన ఆహారం తీసుకొని ఇమ్యూనిటీ స్థాయి పెంచుకోవాలి. తద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. కరోనా నుంచి రక్షణ పొందొచ్చు. ఏవైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.