కల్లూరు, ఏప్రిల్ 25 : పొట్ట చేత పట్టుకుని పనులకు వెళ్తున్న కూలీల ఆటోను కారు అతివేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 12 మందికి తీవ్ర గాయాలైన సంఘటన ఏన్కూరు పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు అంబేద్కర్ నగర్కు చెందిన 14 మంది కూలీలు కల్లూరులో ఆటో మాట్లాడుకుని ఏన్కూరు గ్రామంలో ఓ రైతు తోటలో మిర్చి ఏరడానికి బయలుదేరి వెళ్లారు. కూలీలు ఉన్న ఆటోను, లారీని ఓవర్టేక్ చేయబోయి ముందున్న ఆటోను కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు వేము వరమ్మ(42), బీరవల్లి వెంకటమ్మ(43), మేకల సువార్త, వాడపల్లి సంధ్య, ఉబ్బన సుభద్ర, మేకల శాంతమ్మ, బర్రె చారమ్మ, యు.విజయకుమారి, కోట శారద, ఉబ్బన సుజాత, ఉబ్బన రాణి, కాశిమళ్ల కరుణమ్మ, దామాల మంజరి, ఆటో డ్రైవర్ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా.. తీవ్రంగా గాయపడిన వేము వరమ్మ, బీరవల్లి వెంకటమ్మల ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందారు.
మిగిలిన వారందరూ అక్కడే చికిత్స పొందుతున్నారు. వారిలో మేకల సువార్తను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. మరొకరికి ఖమ్మం సంకల్ప ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. సంఘటన సమాచారం తెలుసుకున్న అంబేద్కర్నగర్ వాసులు, విద్యానగర్ వాసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వారిని చూసేందుకు ఖమ్మం తరలివెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇద్దరి మృతదేహాలను ఖమ్మం ఆసుపత్రిలో పరిశీలించి.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎంపీపీ బీరవల్లి రఘు ఖమ్మం వైద్యశాలలో దగ్గరుండి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఆ విషయాన్ని ఎమ్మెల్యే సండ్రకు వివరించారు. దీంతో ఆయన వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. సత్తుపల్లి రూరల్ సీఐ హనూక్ సైతం ఖమ్మం వైద్యశాలకు వచ్చి మృతుల కుటుంబాలను ఓదార్చారు. క్షతగాత్రుల వివరాలు అడిగి తెలుసుకుని సానుభూతి తెలిపారు. కల్లూరు నుంచి బీఆర్ఎస్ నాయకులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, మేకల కృష్ణ మృతుల కుటుంబాలను పరామర్శించారు.