‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడు అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్లు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున్న పార్లమెంట్ ఎన్నికలు మన గెలుపునకు సోపానం కావాలి.. కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మహబూబాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014, 2019లో విజయం సాధించామని, ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలు మనకు పదేళ్లు అవకాశమిచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలించినట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్లు అనుకోలేదని, నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అన్నారు.. కానీ, అవి 420 హామీలని, వాళ్ల తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించినట్లు తెలిపారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వమేనని, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వమేనని, అయినా ఏనాడు చెప్పుకోలేదు.. ప్రచారం చేసుకోలేదన్నారు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73శాతం జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు.
స్థానిక సంస్థల నుంచి మొదలుకొని అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం మనకున్నదని, బలమైన ప్రతిపక్షం మనదన్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపునకు సోపానం కావాలన్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీపై రేవంత్రెడ్డి అనేక మాటలు మాట్లాడారని, రుణం ఉన్నవాళ్లే కాదు.. లేనివాళ్లు కూడా తీసుకోండి.. మేము అధికారంలోకి రాగా వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ, ఇంత వరకు అతీగతి లేదన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాలంటూ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే స్వేద పత్రం రూపొందించామన్నారు. ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, మన పార్టీకి బలమైన నాయకులు, అద్భుతమైన నాయకత్వం ఉన్నదన్నారు. భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను వరుసగా పెట్టుకుంటూ.., అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తూ, అన్ని వర్గాలకు వర్గాలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడుతామన్నారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్తోపాటు పోడు పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం అందించినా ప్రజలు మనకు పూర్తి మద్దతు ఇవ్వలేదన్నారు. ఇలాంటి అంశాలను విమర్శచేసుకుంటూ ముందుకెళ్దామని కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారాన్ని గ్రామాల్లో చర్చ చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కష్టపడి పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలు వేసుకొని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేద్దామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, తకళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, హరిప్రియానాయక్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.