జూలూరుపాడు, మే 28: వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు 830 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. జూలూరుపాడు పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా డీసీఎం వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా.. 830.540 కిలోల నిషేధిత గంజాయి లభ్యమైందని తెలిపారు.
దీని విలువ సుమారు రూ.4,15,27,000 ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వ్యాన్లో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం బెండ్ జిల్లా హతర్కరి గ్రామానికి చెందిన జస్రం, అదే జిల్లా బరై గ్రామానికి చెందిన రాంకుమార్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. వ్యాన్ వెనుక భాగంలో అనుమానం రాకుండా ఒక ప్రత్యేక అర తయారు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను పెట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్స్టేషన్ పరిధి తులసీపాక గ్రామం నుంచి గంజాయి లోడ్ చేసుకొని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిషేధిత గంజాయిని అమ్మిన, కొనుగోలు చేసిన, రవాణా చేస్తున్న వ్యక్తులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, రవాణాకు ఉపయోగించిన వ్యాన్, రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏడుగురు నిందితులు పరారీలో ఉండగా.. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రవి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు ప్రవీణ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.