కూసుమంచి, జూలై 10 : ‘సర్కారు ఆస్పత్రికే వెళతా.. అక్కడే పరీక్షలు.. ప్రసవం చేయించుకుంటా.. అంటూ మక్కువ చూపుతూ పోటీ పడుతున్నారు గర్భిణులు. ఇందుకు కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కల్పించిన సకల సౌకర్యాలు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలు’. పేద గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో పడిన కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఒక్కో గర్భిణికి సుమారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అయ్యే పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్సీల్లో 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. గతంలో 30 మంది కూడా రాని వారు నేడు 120 నుంచి 150 మంది వరకు వైద్యం కోసం వస్తున్నారంటే ప్రభుత్వ వైద్య సేవలను ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించే అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. వైద్యాన్ని అత్యవసర సేవలుగా భావించిన సీఎం కేసీఆర్ ముందుగా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేసి సమూల మార్పులు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న నిరుపేదల కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్ ఆ వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా అందించేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ దవాఖానలు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలతోపాటు సీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింతగా మెరుగుపడ్డాయి. గతంతో పోల్చితే 10 రెట్లు వైద్య సేవలు పెరిగాయి.
సర్కారు దవాఖానలో ఉచిత పరీక్షలు
ప్రతి పీహెచ్సీలో 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. రోగుల నుంచి నమూనాలు సేకరించి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా, డెంగీ, పూర్తిస్థాయి మూత్ర పరీక్షలు, షుగర్, ఏఎస్ఓ, సీఆర్పీ, ఆర్ఎఫ్, ఆర్పీఆర్, బ్లెడ్ పర్సంటేజీ, బ్లెడ్ గ్రూపు, సీబీపీ, బీటీ/సీటీ, హెచ్బీఎస్, ఈసీఆర్, వీడీఆర్ఎల్, ఆర్బీఎస్, ఎఫ్బీఎస్, పీబీఎస్, ఆర్డీటీ, యూపీటీ, కోవిడ్-19, ఆర్టీ, ఆర్టీపీసీఆర్, కఫం టెస్టు, హెచ్ఐవీ, హెచ్బీ ఏఐసీ, ఎఫ్బీ-ఎస్, పీఎల్బీఎస్, జీటీటీ, ఓజీసీటీ, థైరాయిడ్ 3 రకాలు.. టీ-3, టీ-4, టీఎస్-లివర్, సీరంలో మూడు రకాలు.. టోటల్ ప్రొటీన్, సీరం ఏ/బీ రేషియో, ఎస్ఈపీటీ/ఏఎల్టీ, ఎస్జీఓటీ, ఏఎస్టీ, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డీహెచ్, క్యాల్షియం, యూరిక్ యాసిడ్, కాబో డైరెక్ట్, కాంబో ఇన్డైరెక్ట్ వంటి పరీక్షలు స్థానిక పీహెచ్సీల్లో ఉచితంగా చేస్తున్నారు. ఇక్కడ చేయలేని పరీక్షల నమూనాలను రోజు టీ-హబ్ వాహనంలో ఖమ్మం పంపించి పెద్దాస్పత్రిలో చేయిస్తున్నారు.
కేసీఆర్ కిట్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న తెల్లకార్డున్న మహిళలకు కేసీఆర్ కిట్ అందజేస్తున్నారు. అందులో చంటి పిల్లలకు అవసరమైన వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అదే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటే రూ.50వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తోపాటు ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేల చొప్పున అందజేస్తున్నది. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో గర్భిణులు ప్రసవం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి మక్కువ చూపుతున్నారు.
జ్వర సర్వే, కోవిడ్, గర్భిణులకు వైద్య పరీక్షలు
సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకునేందుకు ఇంటింటి జ్వర సర్వే, కోవిడ్ పరీక్షలు స్థానికంగా చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు. శారీరక మార్పులు, వాటికి అనుగుణంగా ప్రతి ఒక్కరికీ చార్టు తయారు చేసి వాటిని వైద్య ఆరోగ్య శాఖకు అందజేస్తున్నారు. ఆశా వర్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. నెలసరి చెకప్ కోసం ఆశా వర్కర్లు ప్రభుత్వ వాహనాల్లో గర్భిణులను పెద్దాస్పత్రికి తీసుకెళ్లి పరీక్షల అనంతరం పైసా ఖర్చు లేకుండా ఇంటికి పంపిస్తున్నారు. ఒకసారి గర్భిణి ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే స్కానింగ్ టెస్టులు, మందులు ఇలా.. కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. అలాంటి వాటిని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తున్నది. గర్భం దాల్చిన్నప్పటి నుంచే వారికి అన్ని రకాలుగా వైద్య సేవలు అందుతున్నాయి.
57 రకాలకు పైగా వైద్య పరీక్షలు
పీహెచ్సీలో 57 రకాలకు పైగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆధార్ ప్రాతిపదికన ఉచితంగా చేస్తున్నాం. పరీక్ష చేసిన గంటలోపు రోగి చేతికి రిపోర్టు ఇస్తున్నాం. సోమవారం ఒక్క రోజే కూసుమంచిలో 28 మంది శాంపిల్స్ తీశాను. ఆస్పత్రికి వచ్చే రోగులను బట్టి అందులో 10 శాతం మందికి పరీక్షలు చేయాలి. కానీ.. రోజూ ఎక్కువ మందికే పరీక్షలు చేస్తుంటాను.
–ఎస్కే.ఫరహత్, నాన్ గ్రేడ్-2 ఎల్టీ కూసుమంచి
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం
నాకు కూసుమంచి ఆస్పత్రిలోనే సాధారణ ప్రసవం జరిగింది. మగబిడ్డ పుట్టాడు. అదేరోజు నాకు కేసీఆర్ కిట్టు ఇచ్చారు. డాక్టర్లు, నర్సులు వైద్యం మంచిగా అందించారు. అన్ని పరీక్షలు ఉచితంగా చేశారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఇక్కడే వైద్య పరీక్షలు చేశారు. గవర్నమెంట్ దవాఖానలోనే బాగుంది. వైద్యం బాగా అందించడంతో సంతోషంగా ఉంది.
– బొల్లికొండ నవ్య, చేగొమ్మ
నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 57 రకాలకు పైగా వైద్య పరీక్షలు చేస్తున్నాం. అన్నీ ఉచితంగా పేదలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని సబ్ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. మందులు పూర్తిస్థాయిలో సరఫరా అవుతున్నాయి. వ్యక్తిగత జాగ్రత్తలు, పరిశుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ కిశోర్, కూసుమంచి