– ఖమ్మం రూరల్లో 56.6 మీ.మీ వర్షపాతం నమోదు
ఖమ్మం రూరల్, జూలై 21 : ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పునాస పంటలకు (పప్పు ధాన్యాలు) ప్రాణం రాగా, వాణిజ్య పంటలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నేటి వరకు సాగు రైతులు పత్తి, మక్కా, పెసర ఇతర అపరాల పంటల సాగు చేపట్టారు. వరి పంటలకు సంబంధించి నారు పోసి పొలాలను దమ్ము చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వానాకాలం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు అధిక వర్షపాతం కోసం వేచి చూస్తున్నా రైతులకు సోమవారం కురిసిన భారీ వర్షం సంతోషాన్ని కలిగించింది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం రూరల్ మండలంలో రికార్డు స్థాయిలో 56.6 మిల్లు మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.
ఈ సంవత్సరం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం మండలంలో ఇదే తొలిసారి అయింది. దీంతో మంగళవారం పత్తి ఇతర అపరాల పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలలో ఫెర్టిలైజర్స్ మందులను పిచికారి చేసే పనిలో నిమగ్నమయ్యారు. నేడు కూడా చెదురు ముదురు జల్లులు కురుస్తుండటంతో సాగు రైతుల ముఖాలలో సంతోషం కనపడింది. అయితే వరి నాట్లు వేసుకుని పొలాలను దమ్ము చేసుకునే రైతులు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల కాకపోవడం, భారీ వర్షాలు కురవకపోవడంతో వరి నాట్ల ప్రక్రియ ఆలస్యం అవుతుంది.