భద్రాద్రి కొత్తగూడెం, మే 24 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. అన్నదాతల ఆకలి కేకలు, ఆర్తనాదాలు విన్న దాఖలాలు లేవు.. ఎరువులు, విత్తనాలు మొదలుకొని పంట పెట్టుబడులు, సాగునీటి కోసం కర్షకులు అరిగోస పడ్డారు. కాలం కలిసొచ్చి పంట పండితే దళారుల మూకలతో నష్టపోయేవారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్. పంటకు నీరందించేందుకు వెళ్లి విద్యుత్ షాక్తో బలైన రైతులెందరో.. రాత్రివేళ పొలాలకు వెళ్లే క్రమంలో పాముకాటుతో మృత్యువాత పడిన ఘటనలూ అనేకం. బాధిత రైతు కుటుంబాలు నేటికీ ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వాలు ఆ కుటుంబాల ఆక్రందనను వినిపించుకోలేదు.. వారికి భరోసా కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ “భూమిని నమ్ముకుని, సాగు చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లలను చదివించుకుంటున్న రైతు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి”..?అని ఆలోచించారు. ‘రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడకూడదు.. అప్పుల ఊబిలో చిక్కుకోవద్దు.. పిల్లల చదువులు ఆగిపోవద్దు..’ అన్న సంకల్పంతో ‘రైతుబీమా’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏ కారణంతోనైనా రైతు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నారు. అలా పరిహారం అందుకుని నిలదొక్కుకున్న సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి తండాకు చెందిన కున్సోత్ శోభన్ రైతు కుటుంబ గాథ ఇదీ..!
‘ఎద్దు ఏడ్చిన ఊరు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు..’ అని పెద్దల మాట. గతంలో పాలించిన ప్రభుత్వాలన్నీ రైతును ఏడిపించిన చిన్న చూపు చూసినవే. రైతును ఏడిపించిన నేతలే.. గతం నిండా వ్యవసాయం దండుగ అన్న పాలకులే.. నాటి హయాంలో ఎరువులుంటే విత్తనాలు ఉండవ్.. విత్తనాలు ఉంటే ఎరువులు ఉండవ్.. ఒకవేళ అన్నింటినీ సమకూర్చుకుని సాగు ప్రారంభించిస్తే పంటకు సాగునీరు రాదు. ఒకవేళ బావిలో నీళ్లుంటే కరెంట్ ఉండదు.. కరెంట్ వస్తే అదీ కూడా కొన్ని గంటలు మాత్రమే..! ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కాడి పక్కన పెడదాం అనుకున్నారు.. ఇంతలో తెలంగాణ ఉద్యమం రాజుకున్నది.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి స్వరాష్ర్టాన్ని సాధించారు.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో రైతు సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు.. ప్రతిష్ఠాత్మకంగా మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు రుణమాఫీ, పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేశారు.. రైతుల కష్టాలు తీరుతున్నాయి సరే.. కానీ చావు ఎప్పుడు.. ఎవరిని.. ఎలా కబళిస్తుందో తెలియదు కదా..!
కానీ భూమిని నమ్ముకుని, సాగు చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లలను చదివించుకుంటున్న రైతు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి..? ‘రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడకూడదు.. అప్పుల ఊబిలో చిక్కుకోవద్దు.. పిల్లల చదువులు ఆగిపోవద్దు..’ అన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కాని విధంగా మన రాష్ట్రంలో అమలవుతున్నది. పాస్పుస్తకం ఉన్న ప్రతిఒక్కరికీ బీమా కల్పించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లిస్తున్నది. ఏ కారణంతోనైనా రైతు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. బీమా పరిహారం రైతు కుటుంబాలను నిలబెడుతున్నది. అలా పరిహారం అందుకుని నిలదొక్కుకున్న కుటుంబ గాథ ఇదీ..!
విషాదం.. కుటుంబానికి తీరని శోకం..
సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి తండాకు చెందిన కున్సోత్ శోభన్ సాధారణ రైతు. అతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. తనకున్న రెండెకరాలను సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పచ్చగా సాగుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం. 2022 డిసెంబర్లో శోభన్ తన పొలానికి వెళ్లి పనిచేస్తుండగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంటి యజమాని కాలం చేయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ముగ్గురు పిల్లల బాగోగులు ఎలా చూసుకోవాలో తెలియక భార్య లక్ష్మి సతమతమవుతున్నది. ఇలాంటి సందర్భంలో వ్యవసాయశాఖ అధికారులు ఇంటికి వచ్చారు. శోభన్ మృతికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు. వివరాలు తీసుకున్న వారం రోజుల్లోనే నామినీ లక్ష్మి ఖాతాలో రూ.5 లక్షల బీమా పరిహారం జమ అయింది. లక్ష్మికి అప్పుడు ధైర్యం వచ్చింది. సర్వశక్తులు కూడదీసుకుని బీమా సొమ్ముతో కిరాణా షాపు తెరిచింది. క్రమ క్రమంగా వ్యాపారం పుంజుకున్నది. అంతేకాదు ఆమె వ్యవసాయాన్నీ వదిలిపెట్టలేదు. రైతుబంధు, ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుని సాగులో మంచి లాభాలను ఆర్జిస్తున్నది. ముగ్గురు పిల్లలను బంగారంలా చూసుకుంటున్నది.
ముగ్గురు పిల్లలకు మంచి చదువులు..
వ్యవసాయం, వ్యాపారం చక్కగా సాగుతుండడంతో లక్ష్మి ఏ లోటూ లేకుండా ముగ్గురు పిల్లలను చదివిస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైతే పెద్ద కుమార్తె డిగ్రీ ఫస్ట్ ఇయర్, మూడో కుమార్తె ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకోనున్నారు. రెండో కుమార్తె ఇంటర్ సెకండియర్లో అడుగు పెట్టనున్నది. మున్ముందు వారిని పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేస్తానని లక్ష్మి వెల్లడించింది. రైతుబీమా పరిహారం అందకపోతే తమ కుటుంబం నిట్టనిలువునా మునిగిపోయేదని అంటున్నది. రైతుబీమా పథకంతో తమలాంటి ఎన్నో వందల కుటుంబాలు నొలదొక్కుకున్నాయంటున్నది. ఇంతమంచి పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు తమ కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పింది.
రైతుబీమానే కుటుంబాన్ని ఆదుకున్నది..
నా భర్త అకాల మృతి ఎంతో కుంగదీసింది. ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలనే బాధ ఎక్కువైంది. సమాయానికి రైతుబీమా పరిహారం అందకపోతే మా కుటుంబం పరిస్థితి దారుణంగా ఉండేది. పరిహారం సొమ్ముతో కిరాణాషాపు తెరిచాను. దేవుడి దయ వల్ల వ్యాపారం బాగుంది. ప్రతిరోజూ మేం సీఎం కేసీఆర్ను తలుచుకుంటాం. రైతుబీమానే మమ్మల్ని ఆదుకున్నది. కేసీఆర్ రుణం ఎప్పటికీ మరువలేం.
– కున్సోత్ లక్ష్మి. లక్ష్మిదేవిపల్లి తండా,సుజాతనగర్ మండలం.