కూసుమంచి రూరల్, జనవరి 6: ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కూసుమంచి మండలం రాజుపేటలోని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 2,500 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారిని ప్రస్తుతం 4 వేల కిలోమీటర్లకు విస్తరించుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధికి రహదారుల విస్తరణ ఎంతో అవసరమని భావించిన సీఎం కేసీఆర్.. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానిస్తూ రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. ఇవేగాక తెలంగాణను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలిపేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రపంచానికే ఐకాన్గా ఉండేలా అధునాతన కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించారని గుర్తుచేశారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి మంత్రి, కార్యదర్శి సహా ఇతర సెక్షన్లన్నీ ఒకే చాంబర్లో ఉండేలా నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో నిర్మించనున్న అమరుల స్మారకస్తూపం ప్రపంచంలో మూడో అతి పెద్దదిగా ఉంటుందన్నారు. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా ప్రపంచంలో నాలుగో పెద్దదిగా ఉండనుందన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆధునిక కలెక్టరేట్లు, ఇతర శాఖల భవనాలు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ఆర్అండ్బీ శాఖలో 472 కొత్త పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు.
బీటీ రోడ్డు, బ్రిడ్జి పనులు ప్రారంభించిన మంత్రులు
మండలంలోని మందడి నర్సయ్యగూడెం, భగత్వీడు, ఈశ్వరమాదారం, రాజుపేట, పెరికసింగారం గ్రామాలను కలుపుతూ రూ.15 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈశ్వరమాదారం సమీపంలో హైలెవల్ బ్రిడ్జి ప్రతిపాదిత ప్రాంతం వద్ద, రాజుపేట గ్రామం వద్ద ఈ పనులను వారు లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్రావు, సర్పంచ్లు వాసంశెట్టి అరుణ, ఎరబోలు సత్యనారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మోదుగు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.