Summer | భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 28 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/ఇల్లెందు రూరల్ : మార్చి ముగియనే లేదు. ఎండలు మాత్రం దంచికొడుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే ఇక మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే సూరీడు భగ భగమంటున్నాడు. రాత్రిళ్లు 10 గంటలు దాటిన తర్వాత ఉక్కపోతలు ప్రారంభమయ్యాయి. వరుసగా మూడు రోజుల నుంచి ఉభయ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37, 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. బుధవారం రెండు జిల్లాల్లో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లే కూలీలు పొద్దు పొడవక ముందే ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడి పిల్లలకు ఒంటి పూట బడులు అమలు చేస్తున్నది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా, రేపటితో పదోతరగతి పరీక్షలూ ముగియనున్నాయి. ఎండల నేపథ్యంలో మార్కెట్లో ఫ్రిజ్లు, కూలర్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది. ఎండకు తాళలేని ప్రజలు మధ్యాహ్నం కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, లస్సీ, నిమ్మరసం, చెరుకు రసం, మజ్జిగ తాగి ఉపశమనం పొందుతున్నారు. ఏప్రిల్లోనే సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఇక మే నెలలో వచ్చే రోహిణి కార్తె ప్రచండమైన ఎండలను ఇట్టే అంచనా వేయవచ్చు.
అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మన శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. ఎప్పటికప్పుడు తాగునీరు, ద్రవ పదార్థాలు తీసుకోకపోతే ‘డీ హైడ్రేషన్’ సమస్య ఉత్పన్నమవుతుంది. ఫలితంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగిలితే చర్మం పోడిబారుతుంది. దప్పిక ఎక్కువగా ఉంటుంది. తరచూ వాంతులవుతాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. నీరసం ఆవహిస్తుంది. చిరాకు వస్తుంది. కొన్నిసార్లు స్పృహ తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. తీవ్రత ఎక్కువైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, ఆరు బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతుంటారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ ఆహారంలో మజ్జిగ, పండ్లు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలనే తినాలి. సూర్యరశ్మిని గ్రహించే గాఢమైన రంగుల దుస్తులు ధరించకూడదు. తేలికపాటి రంగుల దుస్తులనే ధరించాలి. తలపై విధిగా టోపీ లేదా తలపాగా ఉంచాలి. నిత్యం గొడుగును వెంట పెట్టుకోవాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. కలుషిత నీరు తాగితే అతిసారం ప్రబలే అవకాశం ఉంటుంది. శీతల పానీయాలను తాగకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బను ప్రతిఒక్కరూ మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించాలి.
లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. బిగుతైన దుస్తులు ధరించి ఉంటే శరీరానికి గాలి తగిలే విధంగా చేయాలి. పరిశుభ్రమైన రుమాలుతో బాధితుడి ఒంటిని తుడవాలి. చల్లనినీరు లేదా మజ్జిగ లేదా గ్లూకోజ్ తాగించాలి. ఇలా చేస్తే బాధితుడికి ఉపశమనం కలుగుతుంది. పాక్షిక అపస్మారక స్థితి లేదా పూర్తిగా స్పృహ తప్పినట్లుగా కనిపిస్తే బాధితుడు పడుకున్న బెడ్పై కాళ్ల వైపు ఎత్తైన దిండు అమర్చి శరీరం పైభాగం కంటే పాదాలు ఎత్తుగా ఉండేలా చూడాలి. డాక్టర్ సలహా మేరకు 500 మిల్లీ గ్రాముల పారాసిట్మాల్ మాత్ర ఇవ్వాలి. లేదా 300 మిల్లీ గ్రాముల పారాసిట్మాల్ను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. తర్వాత బాధితుడి శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది.