కేటీపీఎస్, బీటీపీఎస్తో రాష్ర్టానికి వెలుగులు
సిరుల మాగాణి సింగరేణి.. పేపర్ తయారీకి కేరాఫ్ ‘బీపీఎల్’
తెలంగాణ సర్కార్ ప్రోత్సాహంతో మరిన్ని పరిశ్రమలు
లక్షలాది మందికి కొలువులు
కొత్తగూడెం, మార్చి 30: భద్రాద్రి పూర్తి ఏజెన్సీ జిల్లా.. ఇక్కడ అటవీ విస్తీర్ణం, సహజ వనరులు, నీటి లభ్యత, గనులు ఎక్కువ. ఇక్కడి భూములు పరిశ్రమల స్థాపనకు అనువైనవి. ఈ కారణంతో జిల్లాలో పారిశ్రామిక వృద్ధి సాధ్యమైంది.. పాల్వంచలోని కేటీపీఎస్, మణుగూరులోని బీటీపీఎస్ యూనిట్లు రాష్ర్టానికి ‘వెలుగులు’ పంచుతున్నాయి.. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందులోని సింగరేణి గనులు తెలంగాణకే తలమానికమయ్యాయి.. అశ్వాపురంలోని భారజల కేంద్రం దేశంలోనే అరుదైన ఇండస్ట్రీ. ఇవేకాక రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహంతో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు ఇప్పటికే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు.. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు.. ఈ పారిశ్రామిక విజయంపై ప్రత్యేక కథనం..
పారిశ్రామిక వాడ భద్రాద్రి. పూర్తి ఏజెన్సీ జిల్లా. జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు నియోజకవర్గాల్లోని పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎక్కువ అడవి విస్తీర్ణం, పుష్కలంగా నీటి వసతి, పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా భూములు ఉండడం, వాటికి అవసరమయ్యే ముడి సరుకు కూడా జిల్లా పరిధిలోనే దొరుకుతుండటంతో పరిశ్రమలు ఏర్పడ్డాయి. కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్), బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్), నవభారత్, సింగరేణి వంటి పెద్ద సంస్థలే కాక అనేక మధ్యతరహా పరిశ్రమలు కూడా ఏర్పడ్డాయి. పారిశ్రామికవేత్తలకు అనువుగా ఈ ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక కారిడార్గా ప్రసిద్ధిగాంచింది. భద్రాచలం మొదలు కొని కొత్తగూడెం జిల్లా కేంద్రం వరకు పరిశ్రమలు విస్తరించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఔత్సాహికులకు రాయితీలు ఇస్తుండడం, సులువుగా అనుమతులు అందిస్తుండడంతో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. వారు పరిశ్రమలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకా ఎందరో చిన్న తరహా పరిశ్రమలను సైతం నిర్మిస్తున్నారు.
ఇండస్ట్రీయల్ ఏరియా పాల్వంచ..
పాల్వంచలో కేటీపీఎస్ను 1960లో రూ.59.29 కోట్లతో నిర్మించారు. కాలుష్యం కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎనిమిది యూనిట్లను మూసివేశారు. ఆ తర్వాత 5 వ దశలో 9,10 యూనిట్లను నెలకొల్పారు. వీటిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరికొంత కాలం తర్వాత 11, 12 యూనిట్లూ ఏర్పాటయ్యాయి. వీటి పరిధిలో 1,482 మంది కార్మికులు, 300 ఉద్యోగులు, 1,050 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. పాల్వంచలోని నవభారత్ వెంచర్స్ కర్మాగారంలో ఫెల్లో ఎర్రాయిస్ ముడి ఇనుము తయారవుతుంది. దీనిలోనే విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది.ఈ కంపెనీలో 1,400 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
సింగరేణికి పుట్టినిల్లు బొగ్గుట్ట..
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే సింగరేణి ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ 1,659 మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలో 1952లో పీవీకే 5 ఇైంక్లెన్ మైన్,1994లో జీకే ఓసీ, 2005 జేవీఆర్ ఓసీ, 1659 వీకే 7 మైన్లు ఉన్నాయి. వీటిలో 3,092 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో రెండు ఓసీలు ఉన్నాయి. వీటి పరిధిలో 650 మంది పనిచేస్తున్నారు. సింగరేణికి పుట్టినిల్లు ఇల్లెందు (బొగ్గుట్ట). మణుగూరు ఏరియాలో మూడు గనులు, ఒక ఓసీ ఉంది. వీటిలో 3,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
సారపాకలో భద్రాచలం పేపర్ బోర్డు..
సారపాకలో 1978లో ‘భద్రాచలం పేపర్ బోర్డు (బీపీఎల్)’ ఏర్పడింది. ఇక్కడ మేనేజర్ స్థాయి ఉద్యోగులు 500 మంది, రెగ్యులర్ ఉద్యోగులు 1,280 మంది, చిరుద్యోగులు 2,000 మంది పనిచేస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ కాగితం తయావుతుంది. మూడు లక్షల మంది రైతులు దీనికి ముడిసరుకు అందిస్తారు.
మణుగూరు మణిహారం బీటీపీఎస్
మణుగూరు శివారులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) నిర్మిస్తున్నది. సీఎం కేసీఆర్ 2015లో దీనికి శంకుస్థాపన చేశారు. ప్లాంటులో నాలుగు యూనిట్లకు గాను ఇప్పటివరకూ మూడు యూనిట్లు పూర్తయ్యాయి. ఈ యూనిట్ల నుంచి రాష్ట్ర గ్రిడ్కు ఉత్పత్తి సరఫరా అవుతున్నది. త్వరలో నాలుగో యూనిట్ను కూడా అధికారులు పూర్తి చేయనున్నారు. ఇక్కడ సుమారు 3 వేల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలో భూనిర్వాసితులకు కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించనున్నారు. అశ్వాపురం మండలంలో 1983లో భారజల కర్మాగారం ఏర్పాటైంది. ఇక్కడ 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇవి కూడా చుడండి
పూరిగుడిసెకు నిప్పంటుకొని ఆరుగురు చిన్నారులు సజీవ దహనం
ఏపీలో కొత్తగా 993 కరోనా కేసులు