పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన
వేగంగా నియామకాల ప్రక్రియ
ఒకేసారి 346 మందికి ఉద్యోగాలు
సాకారం కానున్న నిరుద్యోగుల కల
మణుగూరు రూరల్, జూలై 30;ఎన్నాళ్ల నుంచో వేచిన తరుణం వచ్చేసింది. మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) నిర్మాణంలో భాగంగా భూమలు ఇచ్చిన నిర్వాసితుల కల నెరవేరనున్నది. వారి కుటుంబాల్లో త్వరలో 346 మంది నిరుద్యోగులకు కొలువులు ఇచ్చేందుకు జెన్కో యాజమాన్యం సిద్ధమవుతున్నది. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ, దేహ దారుఢ్య పరీక్షలు పూర్తి చేసింది. ఇటీవల టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగాలు ప్రకటిస్తామని ప్రకటించడంతో నిర్వాసిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
నిరుద్యోగుల కల నెరవేరబోతున్నది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అధికారులు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చనున్నది. నిర్వాసితుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నది. మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల కల సాకారం కానున్నది. త్వరలో 346 మంది నిరుద్యోగులకు కొలువులు ఇచ్చేందుకు జెన్కో యాజమాన్యం సిద్ధమవుతున్నది. కంపెనీ పరిధిలోని అవకాశాలను పరిగణలోకి తీసుకుని కొందరికి సెక్యూరిటీ విభాగం, మరికొందరికి జేపీఏ (జూనియర్ ప్లాంట్ అటెండెంట్), జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పిత్తి చేసేందుకు బీటీపీఎస్ నిర్మాణానికి 2015 మార్చిలో శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్కు అప్పగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు 1,100 ఎకరాల భూమిని సేకరించారు. అందుకు ప్రతిఫలంగా కొందరు నిర్వాసితులు పరిహారం అందుకున్నారు. మరికొందరు తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అధికారులకు విన్నవించారు. ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉండగా పనుల్లో జాప్యం జరిగింది. మొత్తం నాలుగు యూనిట్ల పరిధిలో ఇప్పటికే మూడు యూనిట్లు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో నాలుగు యూనిట్ పనులూ పూర్తికానున్నాయి. మరోవైపు నిర్వాసితులకు కొలువులు ఇవ్వాలనే ఉద్దేశంతో యాజమాన్యం ప్రక్రియ వేగంగా చేపడుతున్నది.
ఆది నుంచి నిరుద్యోగులపై శ్రద్ధ..
ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైన తొలినాళ్ల నుంచి జెన్కో యాజమాన్యం నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆశావహులకు సంస్థకు కావాల్సిన టెక్నికల్ నైపుణ్యాలను నేర్పించింది. నిర్వాసిత కుటుంబాల్లో డిగ్రీ ఆపై చదివిన వారితో పాటు టెన్త్ చదివిన వారికీ కొలువులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు వారికి ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో శిక్షణ ఇప్పించింది. వీరిలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 170 మందికి బీటీపీఎస్ పరిధిలోని కాంట్రాక్ట్ కంపెనీలతో మాట్లాడి పని కల్పించింది. నిర్వాసితులకు కొలువులు ఇవ్వాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు నిరుద్యోగ కమిటీ వినతి మేరకు అనేకసార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావును కలిశారు. కలెక్టర్, బీటీపీఎస్ సీఈ బాలరాజుతో పలుమార్లు సమావేశమయ్యారు. చివరికి నిర్వాసితులకు కొలువులు సాధించారు.
విద్యార్హతను బట్టి అవకాశాలు..
సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే సదరు ప్రాజెక్టు పూర్తయితే తప్ప నిర్వాసితులకు కొలువులు రావు. కానీ బీటీపీఎస్ పరిధిలోని నాలుగు యూనిట్ల పరిధిలో ఇప్పటికీ పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ప్రభుత్వం 346 మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్, టీఎస్ జెన్కో సీఅండ్ఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆదేశాలతో ఉన్నతాధికారులు నిర్వాసితులకు కొలువులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీ పరిధిలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని కొందరికి సెక్యూరిటీ విభాగం, మరికొందరికి జేపీఏ (జూనియర్ ప్లాంట్ అటెండెంట్), జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో నిర్వాసిత కుటుంబాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సహకరించిన వారికి కృతజ్ఞతలు..
మా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్లాంట్లో ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఇప్పటివరకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేస్తూ వస్తున్నాం. ఇప్పట్లో ఉద్యోగాలు వస్తాయనుకోలేదు. నియామకాలు చేపడతారని తెలిసి ఆనందిస్తున్నా. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.
-వెంకటేశ్వర్లు, నిర్వాసితుడు
సంస్థలో భాగస్వాములుకండి..
నిర్వాసితులు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా రాష్ర్టానికి వెలుగులు పంచే బీటీపీఎస్లో భాగస్వాములు కావాలి. ఉద్యోగ అవకాశాన్ని అదృష్టంగా భావించాలి. సంస్థతో పాటు తెలంగాణ ప్రజలకు విద్యుత్ అందించే క్రతువుకు తోడ్పాటునందించాలి.