మార్పులు, చేర్పులను పరిశీలించాలి
జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఈ.శ్రీధర్
మామిళ్లగూడెం, నవంబర్ 29: ఓటర్ల సంక్షిప్త సవరణ ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా జరుగుతోందని ఎన్నికల జిల్లా పరిశీలకుడు ఈ.శ్రీధర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఓటరు జాబితా సవరణలో చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మార్పులు చేర్పులపై వచ్చిన క్లెయిములను క్షుణ్ణంగా పరిశీలించి సవరణలను చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు అందిన క్లెయిములను వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన రికార్డును పకడ్బందీగా నిర్వహించాలని, నియోజకవర్గానికి సంబంధించిన రికార్డు మొత్తం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వద్ద భద్రపర్చాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించిన రిజిస్టర్లు, రసీదులను పకడ్బందీగా ఉంచాలని సూచించారు. సవరణ ప్రక్రియ పూర్తయిన తరువాత తుది జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి రసీదు పొందాలన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2021 నవంబర్ 1న ముసాయిదా జాబితా ప్రచురించామని, నూతన ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పుల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించామని అన్నారు. ఐదు నియోజక వర్గాల్లోని 1363 పోలింగ్ కేంద్రాలతోపాటు అదనంగా మరో 53 నూతన పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 11,42,245 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఫారం-6కు 3,721, ఫారం- 7కు 10,358, ఫారం-8కు 782, ఫారం-8 ఏకు 1,659 కలిపి మొత్తం 16,520 క్లెయిములు ఆన్లైన్లో వచ్చినట్లు వివరించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవో రవీంద్రనాథ్, దశరథ్, ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు పాల్గొన్నారు.