ప్రధాని మోడీ పతనం ప్రారంభమైంది
కార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాల రద్దు
సాగుచట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడుదాం
సీపీఎం ఖమ్మం జిల్లా మహాసభల్లో తమ్మినేని
ఖమ్మం, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని, ప్రధాని మోదీ పతనం ప్రారంభమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాలు రద్దయ్యాయని స్పష్టం చేశారు. కేంద్ర పాలకులు గుడ్డిగా చట్టాలు చేయడం వల్లనే 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. సాగు చట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన నగరంలోని ఎంబీ గార్డెన్స్లోని వేదగిరి శ్రీనివాసరావునగర్లో సోమవారం ప్రారంభమైన సీపీఎం ఖమ్మం జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. పంజాబ్, హర్యానా, యూపీ తదితర రాష్ట్రాల రైతులు పట్టుదలతో ఉద్యమించి నల్లచట్టాలను తిప్పికొట్టారని అన్నారు. తాను తీసుకొచ్చిన సాగు చట్టాలను కొందరు రైతులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని ప్రధాని క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. నగరీకరణ పథకంలో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం, లీజుకు ఇవ్వడం వంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటోందని ఆరోపించారు.
అరుణకాంతులీనిన సభా ప్రాంగణం
ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. మరో 500 మందిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దాదాపు అందరూ ఎరుపురంగు దుస్తులు ధరించడం, సభా ప్రాంగణంలో ఎరుపుతోరణాలు ఏర్పాటు చేయడంతో ఎటుచూసినా అరుణవర్ణం శోభితమైంది. సీపీఎం నేతలు మామిళ్ల సంజీవరెడ్డి, పాన్నం వెంకటేశ్వరరావు, బి.వెంకట్, పోతినేని సుదర్శన్, బత్తుల హైమావతి, సాయిబాబు, బుగ్గవీటి సరళ, అన్నవరపు కనకయ్య పాల్గొన్నారు.