సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వం
రూ.68 కోట్లతో సత్తుపల్లి, మధిరలో 100 బెడ్ల ఆసుపత్రులు
సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, జనవరి 29: సర్కారు వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అందుకే సంక్షేమానికి, అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందని అన్నారు. సత్తుపల్లి పర్యటనకు వచ్చిన ఆయన.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని 100 బెడ్ల ఆసుపత్రి నిర్మిస్తున్నామని, మధిర, సత్తుపల్లిలో రూ.68 కోట్లతో ఒక్కో చోట 100 బెడ్లతో ఆసుపత్రి నిర్మాణాలకు సీఎం కేసీఆర్ నిధులు మంజురు చేశారని తెలిపారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో రూ.7.50 కోట్లతో క్యాథ్ల్యాబ్ను ప్రారంభించామని, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అడిగిన విధంగా రూ.3 కోట్లతో టీ డయాగ్నస్టిక్ సెంటర్తో రేడియాలజీ సెంటర్ను ప్రారంభిస్తామని అన్నారు. పూర్తి ఉచితంగా సింగిల్ యూజ్ డైలర్ విధానంతో ప్రతి కిడ్నీరోగికీ డయాలసిస్ చేస్తున్నామని, ఈ విధానం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. సత్తుపల్లిలో ప్రస్తుతం ఐదు బెడ్ల డయాలసిస్ కేంద్రం నడుస్తోందని, మరో ఐదు బెడ్ల డయాలసిస్ మిషన్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. రూ.34 కోట్ల నిధుల్లో రూ.29 కోట్లు ఆసుపత్రి నిర్మాణానికి, రూ.5 కోట్లు ఆధునిక పరికరాల కొనుగోలుకు వెచ్చిస్తామన్నారు. బెడ్ల సంఖ్య 30 నుంచి 100కు పెరిగిన నేపథ్యంలో వైద్యసేవలకు అనుగుణంగా వైద్యులను, సిబ్బందిని కేటాయిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20 నుంచి 52 శాతానికి ప్రసవాల సంఖ్య పెరిగిందని, కేసీఆర్ కిట్లతో ఆ సంఖ్య మరింత పెరిగిందని అన్నారు. కల్లూరు, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలావస్థకు చేరిన దృష్ట్యా టీఎస్ఎంఐడీసీ ద్వారా నివేదిక తెప్పించి నూతన భవనాల మంజూరుకు కృషిచేస్తామన్నారు.
తల్లాడ పీహెచ్సీని 24 గంటల ఆరోగ్య కేంద్రంగా మారుస్తామని, వేంసూరు మండలం బీరాపల్లిలో మరో పీహెచ్సీని ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని అన్నారు. ఎమ్మెల్యే సండ్ర హైదరాబాద్లో తనను కలిసి అంబులెన్స్ను అడిగిన వెంటనే మంజూరు చేశామన్నారు. తాను సత్తుపల్లి పర్యటనకు వచ్చినందుకు అంబులెన్స్ సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే గుర్తుచేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే సండ్ర అన్నింటా ముందువరసలో నిలుపుతున్నారని ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లిలో ఆసుపత్రిఇ నిర్మించి నాలుగున్నర దశాబ్దాలు కావడంతో ఆసుపత్రి పూర్తి శిథిలావస్థకు చేరిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి 100 బెడ్ల ఆసుపత్రి నిర్మాణానికి రూ.34 కోట్లు నిధులు మంజూరుచేశారని అన్నారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రితోపాటు కల్లూరు, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం నూతన భవనాల నిర్మాణాలకు మంత్రి హరీశ్రావు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా సెకండ్వేవ్ సమయంలో యువనేత కేటీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని తలసేమియా బాధితులకు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 1000 యూనిట్ల రక్తం అందించినట్లు గుర్తుచేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్, టీఎస్ఐఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీఎంహెచ్వో మాలతి, ఆర్డీవో సూర్యనారాయణ పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్పై మంత్రి ఆరా..
నారాయణపురంలో తనను కలిసేందుకు వచ్చిన ఏఎన్ఎం, ఆశాలు, వైద్యసిబ్బందితో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్, జ్వర సర్వేలపై ఆరా తీశారు.
10 లక్షలు దాటిన కల్యాణలక్ష్మి వివాహాలు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వివాహాలు 10 లక్షల మార్కును దాటాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే 8 వేల మందికి పైగా ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం నుంచి చేయూత అందిందన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమిళనాడు కూడా ఇటీవల ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.