సాగునీటి పథకాల నిర్మాణంతో మారిన రూపురేఖలు
సేద్యానికి ఊపిరి పోసిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకం
మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ
పెరిగిన భూగర్భ జలాలు
తగ్గిన వలసలు.. ఉపాధికి బాటలు
పాలేరు నియోజకవర్గంలో మారిన ప్రజల బతుకు చిత్రం
పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో ప్రజలు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు మండలాల్లో వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. వరుణుడు కరుణిస్తే పంటలు పండేవి. లేదంటే వలస వెళ్లాల్సిన పరిస్థితి. వర్షభావ పరిస్థితుల వల్ల కరువు నిత్యం కృత్యంగా మారేది. మూడు మండలాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో మాగాణి భూములు బీళ్లుగా మారాయి. రైతులు బావులు, బోర్లు తవ్వుకున్నా.. చుక్కనీరు వచ్చేదికాదు. 300 అడుగులు లోతు బోర్లువేసినా.. చుక్కనీరు రాకపోయేది. వర్షభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. సాగు,తాగునీటి కొరత సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం పాలేరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చింది. తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్ మండలాల్లో సాగునీటి వనరుల కల్పనకు కృషి చేసింది.
కరువు తీర్చిన భక్తరామదాసు
శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో పాలేరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. తుమ్మల చొరవతో తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసింది. పాలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను శ్రీరాంసాగర్ కాల్వల ద్వారా మూడు మండలాల్లోని అన్ని చెరువుల్లోకి తరలిస్తున్నది. దీంతో నాడు నెర్రెలు వారిన నేలలు.. నేడు పచ్చని పంటపొలాలతో దర్శనమిస్తున్నాయి. సాగునీటి వనరులు సమకూరడంతో ఐదేళ్లుగా రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాగునీటి పథకాలతో సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. బావులు, బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. తద్వారా పరోక్షంగా మరో 20 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీటి వసతి మెరుగైంది. సాగునీటి వసతి ఏర్పడడంతో ఇతర ప్రాంతాలకు వలసెళ్లిన రైతులు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. మళ్లీ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ ప్రాంతం నుంచి కూలీల వలసలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వలస వచ్చి పనలు చేసుకుంటున్నారు. అంతేకాదు, భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భూమి ఎకరాకు ఐదు వంతుల రేటు పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. మొత్తంగా ఇక్కడి ప్రజల బతుకు చిత్రమే మారిపోయింది. కరువుకాటకాలకు తెరపడింది. ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. రైతు కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు.
చెరువులకు పూర్వవైభవం
తెలంగాణ ప్రభుత్వంచేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులకు జలకళ సంతరించుకున్నది. తిరుమలాయపాలెం మండలంలో నాలుగు విడతల్లో రూ. 14.40 కోట్ల వ్యయంతో 79 గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేశారు. ఖమ్మంరూరల్, కూసుమంచి మండలాల్లో రూ.22 కోట్లతో చెరువులను మరమ్మతు చేయడం జరిగింది. ఈ మూడు మండలాల్లో ప్రవహిస్తున్న ఆకేరు, పాలేరు వాగులపై రూ. 5 కోట్లతో ఏడుచోట్ల చెక్డ్యామ్లు నిర్మించారు.
బావులు, బోర్లలో పెరిగిన భూగర్భజలం..
గతంలో ఈ ప్రాంతంలో 300 అడుగులు బోర్లు వేసినా చుక్కనీరొచ్చేది కాదు. వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడేవారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి పథకాల నిర్మించడంతో బోరు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. ప్రస్తుతం రెండు పంటలు పండించుకుంటున్నాం.
-మద్దినేని శ్రీనివాసరావు, హైదర్సాయిపేట, రైతు