బండి సంజయ్ మిలియన్ మార్చ్పై మంత్రి తన్నీరు హరీశ్రావు ఫైర్
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో కొట్లాడాలని హితవు
నిరుద్యోగం పెరగడానికి కేంద్రంలోని బీజేపీ విధానాలే కారణమని మండిపాటు
ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమే బీజేపీ విధానమంటూ విమర్శ
ఖమ్మం, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘బండి సంజయ్.. మిలియన్ మార్చ్ను గల్లీలో కాదు.. ఢిల్లీలో చెయ్..’ అంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో కొట్లాడాలంటూ హితవు చెప్పారు. బీజేపీ విధానాల వల్లనే దేశంలో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయించడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. కొత్తగూడెంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాన్ని శనివారం పరిశీలించిన అనంతరం మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి హరీశ్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని వారి పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. చీటికీ మాటికీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పారదర్శకంగా అమలవుతున్న 317 జీవోను రద్దుచేయాలని బీజేపీ ఎందుకు అడుగుతుందో ఆ పార్టీకే స్పష్టతలేదని, 317 జీవోను రద్దుచేయడమంటే రాష్ట్రపతి ఉత్తర్వులను ధిక్కరించడమేనని అన్నారు. ఈ అంశాల్లో బీజేపీ సోయి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. 317 జీవో వల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు.
బీజేపీ ఉద్దేశంలో స్థానికులకు ఉద్యోగం రావద్దా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువు చెబుతామంటే బీజేపీకి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కేంద్రం మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వకుండా రిక్తహస్తం చూపిందని విమర్శించారు. 84 నవోదయ పాఠశాలలను మంజూరు చేస్తే తెలంగాణకు మాత్రం గుండు సున్నానే మిగిల్చిందని మండిపడ్డారు. ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీఈ, ఐఐఎం వంటి వాటిల్లో సైతం తెలంగాణకు ఒక్కటీ మంజూరు చేయలేదన్నారు. ఇది బీజేపీ నిజస్వరూపమని, బండి సంజయ్ నకిలీ వాట్సప్లతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నుంచి రెండేళ్లుగా తెలంగాణకు రావాల్సిన రూ.900 కోట్లలో ఒక్కపైసా కూడా రాలేదన్నారు. తమ వాటా సొమ్ము ఎందుకు ఇవ్వదో కేంద్రం తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేయాల్సింది చేయదని, చేసేవారిని అడ్డుకుంటుందని అన్నారు.
రాష్ట్రంలో ‘మన ఊరు.. మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు రూ.7,300 కోట్లను ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు. రాష్ర్టానికి మంచి చేసేందుకు బీజేపీ నేత బండి సంజయ్ ప్రయత్నించాలే తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. పార్దీవదేహాలను మృతుల ఇళ్లకు ఉచితంగా తరలించేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా ఆసుపత్రులకు రెండు ప్రత్యేక వాహనాలు కావాలని మంత్రి హరీశ్రావును కోరారు. వాటిని సమకూరుస్తామని మంత్రి హరీశ్రావు సమాధానమిచ్చారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్సీ తాతా మధు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భదాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.