రూ.8.50 కోట్లతో నిర్మాణం
మంత్రి అజయ్ ప్రత్యేక చొరవతో పనులు పూర్తి
వచ్చే నెల 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
ఖమ్మం, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరం టూరిజం హబ్గా మారనున్నది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో నగరంలోని లకారం తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. వచ్చే నెల 2న లాంఛనంగా ప్రారంభం కానున్నది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సస్పెన్షన్ బ్రిడ్జి హైదరాబాద్లోని ట్యాంక్బండ్ తరహాలో పర్యాటకులను ఆకర్షించనున్నది. నగరానికి మరో మణిహారం కానున్నది.
ఖమ్మం నగరం టూరిజం హబ్గా మారనున్నది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో నగరంలోని లకారం ట్యాంక్ బండ్పై తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. జనవరి 2న రాష్ట్ర ఐటీ మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ వంతెనను ప్రారంభించనున్నారు. ఇప్పటికే మెడికల్, గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీస్, ఐటీ హబ్గా మారిన నగరం టూరిజం స్పాట్గానూ రూపాంతరం చెందుతున్నది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సస్పెన్షన్ బ్రిడ్జి హైదరాబాద్లోని ట్యాంక్బండ్ తరహాలో పర్యాటకులను ఆకర్షించనున్నది.
లక్నవరం తీగల వంతెన తరహాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువుపై నిర్మించిన తీగల వంతెన రాష్ట్రంలోనే అతిపెద్దది. రాష్ట్రంలో ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం. చెరువు నిండా నీరు వేలాడే బ్రిడ్జిపై స్నేహితులు, కుటుంబ సభ్యులతో నడిస్తే ఆ అనుభూతే వేరు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇదే తరహాలో నగరంలోని లకారం చెరువుపై తీగ వంతెన ఏర్పాటైంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో బ్రిడ్జిమ్యాన్ గా పేరుగాంచిన భరద్వాజ్తో వంతెన డిజైన్ చేయించారు. సర్కార్ వంతెన నిర్మాణానికి రూ.8.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే నిర్మాణం పూర్తియింది.
ఉమ్మడి జిల్లాకు ఆకర్షణగా..
గరం టూరిజం హబ్గా మారబోతున్నది. నగరంలోని లకారం మినీట్యాంక్ బండ్ మణిహారాలు కాగా ఇక తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జిల్లాలోని అర్బన్ ఫారెస్ట్ పార్, స్తంభాద్రి దేవాలయం, ఖిల్లా, కూసుమంచి శివాలయం, ముజ్జుగూడెం బౌద్ధస్తూపం, నేలకొండపల్లి భక్త రామదాస్ స్మారక మందిరం, పాలేరు, వైరా రిజర్వాయర్లు, జమలాపురం చిన్న తిరుపతి శ్రీవెంకటేశ్వరాలయం, గార్ల ఒడ్డు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కూసుమంచి ప్రముఖ శివాలయం, పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని రిజర్వాయర్, భద్రాచలంలో గోదావరి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల రామాలయం, జగన్నాథపురంలో పెద్దమ్మ గుడి పర్యాటక స్థలాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రధానంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. త్వరలో పాలేరు రిజర్వాయర్ ఐలాండ్లో స్వామి వివేకానంద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని టూరిస్టు స్పాట్గా తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. లకారంపై తీగల వంతెన పూర్తయితే నగరానికి పర్యాటకుల తాకిడి పెరగనున్నది. పరోక్షంగా నగరంలో వ్యాపారాభివృద్ధికి దోహదపడనున్నది.