మిశ్రమ సాగు విధానం లాభదాయకం
చీడపీడలు ఉండవు.. భూసారం తగ్గదు..
ప్రధాన పంటల రక్షణకు ఇదే ఉత్తమ మార్గం
ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఒక పంటైనా చేతికి..
రెండు పంటలూ కలిసి వస్తే లాభమే
కొత్తగూడెం, నవంబర్ 28;వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు.. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం.. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం.. ఎంత నష్టం వస్తుందో బేరీజు వేయలేం.. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతరపంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు. ప్రధాన పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు.. కలుపు మొక్కల బెడద నుంచి తప్పించుకోవచ్చు.. కాలం కలిసి వస్తే రెండు పంటల నుంచీ ఆదాయం పొందవచ్చు.. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఒక పంట ద్వారా అయినా లాభాలు గడించవచ్చు. అయితే రైతన్నలూ.. అంతర పంటల సాగుతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..!
కంది ప్రత్యేకత ఇదీ..
అంతర పంటల్లో కందికి ప్రత్యేకత ఉన్నది. వీటి మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి చొచ్చుకుపోతాయి. తేమను, పోషకాలను లోపలి పొరల నుంచి తీసుకుంటాయి. సాగులో సేంద్రియ ఎరువులనే వాడాలి. నిర్దేశిత మోతాదులోనే విత్తనాలు వేయాలి. పోషకాల ఆవశ్యకత, భూసారాన్ని బట్టి ఎరువులు వినియోగించాలి. కీలక సమయాల్లో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి అందుబాటులో ఉంచాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కంది పంట లాభదాయకమే.
సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ తక్కువలను గమనించాలి. నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేర్వేరు కాల పరిమితులు ఉన్న పంటలు, పప్పు జాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. ఉదాహరణకు కంది, మొక్కజొన్న పంటలను ఒకేసారి సాగు చేసుకోవచ్చు. ఒక పంటను ఆశించే పురుగుల నివారణకు మరో పంటను పండించవచ్చు. ప్రధాన పంట, అంతర పంటలపై ఒకేరకమైన తెగులు వ్యాపించే అవకాశం ఉంటే సాగు చేయకపోవడమే మంచిది. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అంతర పంట నివారించగలిగేలా చూసుకోవాలి. చీడ పీడల తాకిడిని దృష్టిలో పెట్టుకొని పంటలను ఎంపిక చేయాలి. పత్తి పంటలో పెసర, మినుములు, బెండ, సోయా చిక్కుడు వంటి పంటలు సాగు చేసుకోవచ్చు.
తేమ నిల్వ పెరుగుతుంది..
అంతర పంటలుగా వేరుశనగలో అలసంద, పొద్దు తిరుగుడు సాగు చేస్తే ఆకుముడత తెగులు ఉధృతి ఉండదు. సజ్జ సాగు చేస్తే మొవ్వకుళ్లు తెగులు బెడద ఉండదు. వేరుశనగలో ధనియాలు వేస్తే శనగ పచ్చ పురుగు ఉధృతి బాధ ఉండదు. పత్తిలో వేరుశనగ, ఆలసంద, పెసర, సోయా చిక్కుళ్లు సాగు చేస్తే మిత్రపురుగుల సంఖ్య పెరిగి శనగ పచ్చ పురుగును కట్టడి చేయవచ్చు.
బహుళ ప్రయోజనాలు..
అంతర పంటల సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకేసారి రెండు రకాల పంటలు సాగు చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో ఒక పంట అయినా చేతికి వస్తుంది. భూమిలో పోషకాల వినియోగం తగ్గుతుంది. కలుపు మొక్కల బెడద తప్పుతుంది. నేలకోతకు ఆస్కారం ఉండదు. భూసారాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పప్పు ధాన్యాల సాగుతో భూసారాన్నియ మరింత పెంచుకోవచ్చు. అంతర పంటలతో ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని ఎక్కువ మొత్తంలో వినియోగించుకోవచ్చు
ఎన్నో ఉపయోగాలు..
అంతర పంటల సాగుతో భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. పంటలకు ఎరువులు వాడాల్సిన అవసరమూ తగ్గుతుంది. రెండు పంటలు వేస్తే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంట ద్వారా ఆదాయం పొందవచ్చు. పప్పు ధాన్యాలు, దుంపల సాగుతో భూమి సారవంతమవుతుంది. రైతులు ఎక్కువగా ఆయిల్ పాం, కూరగాయలు, వేరుశనగ వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు.
-లక్ష్మీనారాయణమ్మ, కేవీకే కో-ఆర్డినేటర్, లక్ష్మీదేవిపల్లి