వందేళ్లుగా అనేక రకాల వ్యాధులకు పసరు మందు
దీర్ఘకాల ప్రమాదకర వ్యాధుల నివారణకు పంపిణీ
ప్రతిసారీ రాకుండా తీవ్రతను బట్టి ఔషధం
అల్లోపతి మందులకు దీటుగా ఆదరణ
ఖమ్మం రూరల్, మే 28: అత్యాధునిక వైద్యం సౌకర్యం అందుతున్న ఈ రోజుల్లో కూడా పసరు మందులకూ ఆదరణ తగ్గడం లేదు. వాటిల్లోనూ సైన్స్ దాగి ఉండడం, అది కూడా ఎంతో ఆదరణ పొంది ఉండడం ఇందుకు ఉదాహరణ. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య నాటు వైద్యం ఈ కోవలోనిదే అయినా దాని ఆయుష్ విభాగం అధ్యయనం జరుపుతోంది. అయితే కామెర్ల వ్యాధి నివారణకు పసరు మందుకు కూడా విశేష ఆదరణ ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో దాదాపు వందేళ్లుగా ఈ వ్యాధికి ఆకు పసరు మందు లభిస్తుండడం, దానికి తొందరగా నయం అవుతుండడం గమనార్హం. కామెర్లు వచ్చాయంటే వైద్యులు సైతం ఆ ఊరి పేరు జపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కామెర్ల వ్యాధి అనగానే.. ‘తల్లంపాడు పసరు మందు తాగిరాపో..’ అంటూ పెద్దలు సూచిస్తున్నారంటే దాని ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పేరు మోసిన వైద్యులు కూడా ఈ పసరు మందు కోసం క్యూలో నించున్న సందర్భాలూ ఉన్నాయి. అందుకే ‘కామెర్ల మందుకు కేరాఫ్ తల్లంపాడు’ అనే మాట ప్రసిద్ధికెక్కింది. ఇంకా అనేక వ్యాధులకూ ఇక్కడే మందు లభిస్తుండడం విశేషం.
యరసాని రవీంద్రనాథ్రెడ్డి.. తల్లంపాడు గ్రామానికి చెందిన పూర్వికుడు, పసరు వైద్యంలో నిష్ణాతుడు. అనేక వ్యాధులకు పసరు మందు ఇస్తుంటాడు. ప్రత్యేకించి కామెర్ల మందు అనగానే తల్లంపాడు పేరే గుర్తొచ్చేంతగా ప్రసిద్ధిగాంచాడు. శతాబ్ద కాలంగా ఇక్కడ ఈ పసరు మందు లభిస్తోంది. కామెర్ల మందు అనగానే ఇప్పటికీ చాలామంది తల్లంపాడు పేరును ప్రస్తావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. యరసాని రవీంద్రనాథ్రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తున్న పూర్వికులు ఇప్పటికీ పసరు మందును వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేస్తున్నారు. రూ.లక్షలు పోసి ఖర్చు చేసే వైద్యాన్ని రూ.100కే అందించడం ఇక్కడి ప్రత్యేకత. కాకపోతే ఈ మందు తీసుకున్నాక ఆహార నియమాలు పాటించాలి.
ఏయే వ్యాధులకు మందు దొరుకుతుందంటే..
ప్రధానంగా అన్ని రకాల కామెర్లకు ఇక్కడ మందు లభిస్తోంది. వ్యాధి ముదిరిన వారు ఇక్కడికి వచ్చినా తల్లంపాడు మందు తీసుకుంటే కోలుకుంటారు. పాము కాటు మందు, కీళ్ల నొప్పులు, మూర్ఛ, ఉబ్బసం, మొలల వ్యాధి, వేడి, ముట్టుశూల, పార్శపు నొప్పి, డొక్కశూల, తలనొప్పి, మడిమశూల, చెవుడు, నాశిక అద్భుతం, ముక్కులో గడ్డలై రక్తం కారడం, రసికారడం, నీరు కారడం, చెవిపోటు, చెవి చీము, పిప్పి పన్ను, ము ల్లు మందు, గోరు చుట్టు, కుక్కకా టు, నోటిపూత, తామర, బొల్లి తదితర స మస్యలకు తల్లంపాడు దొరగారి గడి లో అతి తక్కువ ధరకే మందు లభిస్తుంది.
కామెర్ల శాతం ఇలా తెలుసుకుంటారు
మానవ శరీరంలో కామెర్లు వ్యాప్తి చెందినప్పుడు జబ్బు శాతాన్ని మూలిక వైద్యులు ప్రత్యేక పద్ధతి ద్వారా తెలుసుకుంటారు. కామెర్లు వచ్చిన వ్యక్తి మూత్రం ఉదయం లేచిన వెంటనే మొదట కొద్దిగా ఒక చిన్న పాత్రలో సేకరిస్తారు. ఆ మూత్రంలో తెల్లటి బియ్యాన్ని వేసి 20 నిమిషాల తర్వాత మూత్రాన్ని పారబోసి బియ్యాన్ని గమనిస్తారు. బియ్యం ఎంత ఎక్కువ మోతాదులో పసుపు రంగులోకి మారితే వ్యాధి తీవ్రత అంతగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఇప్పటి వరకూ పసరు రూపంలో ఉన్న ఈ మందు ఇప్పుడు పొడి రూపంలో లభ్యమవుతోంది.