నెరవేరనున్న 100 పడకల ఆసుపత్రి హామీ
మాటనిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
ఫలించిన ఎమ్మెల్యే సండ్ర కృషి
నేడు నిర్మాణ పనులకు శంకుస్థాపన
సత్తుపల్లి, జనవరి 28 : కల సాకారం కాబోతున్నది. రోగులకు మెరుగైన వైద్యం అందనున్నది. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి. సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమమైంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేందుకు గతంలోనే మంత్రి వర్గంలో తీర్మానించి సత్తుపల్లికి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.34 కోట్లు నిధులు మంజూరు చేశారు. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గతంలో 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని గతేడాది 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించారు. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పూర్తయిన ఆసుపత్రిని ప్రారంభించారు. నాలుగున్నర దశాబ్దాలు కావడంతో ఆసుపత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షానికి కురుస్తూ రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు నూతన భవనం మంజూరు కావడంతో ప్రజల కల సాకారమైంది.
చేరువకానున్న వైద్యం
నియోజకవర్గ కేంద్రం కావడం. జనాభా పెరగ డంతో పెద్దఎత్తున ఆసుపత్రికి రోగులు వస్తున్నారు. జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను ఇక్కడికే తరలిస్తున్నారు. మరోపక్క డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆసుపత్రికి రద్దీ పెరిగింది. నూతన భవనం పూర్తయి ప్రారంభమైతే మరిన్ని సౌకర్యాలు కల్పించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కల్లూరులో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచారు. పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ఆధునీకరించేందుకు ఎమ్మెల్యే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వేంసూరు మండలం బీరాపల్లిలో ఓ పీహెచ్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చాయి. నియోజకవర్గంలో ఆసుపత్రుల ఆధునీకరణ, వైద్యుల కొరతను తీర్చేందుకు శనివారం మండలానికి రానున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావుకు ఎమ్మెల్యే సండ్ర సమస్యలను సైతం విన్నవించనున్నారు.