అన్ని జిల్లాల్లో రెండోదశ సర్వే ప్రారంభిస్తాం
కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి మరిన్ని హంగులు
మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్
నగరంలో క్యాథ్ల్యాబ్, ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం
మధిర వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన
కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యటించిన మంత్రులు
ఖమ్మం, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని జిల్లాల్లో రెండో దశ సర్వేప్రారంభిస్తామని, ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. రూ.7.50 కోట్లతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్ పరికరాన్ని, ట్రామాకేర్, ఉమెన్ మిల్క్ సెంటర్ను శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండోదశ వ్యాక్సినేషన్లో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు దవాఖానలన్నింటినీ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉమెన్ మిల్క్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, ఇందుకోసం కళాశాలలో ఏర్పాటు చేసిన వసతులు, ఇతర అంశాలను శనివారం తాను పరిశీలిస్తానని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా నియంత్రణ కోసం చేపట్టిన రెండో దశ వ్యాక్సినేషన్లో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉందని అన్నారు. ఇదే అంకితభావంతో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. రూ.7.50 కోట్లతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్ పరికరాన్ని, ట్రామాకేర్ సెంటర్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని సర్కారు దవాఖానలన్నింటినీ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే అన్నిరకాల వైద్యసేవలనూ అందిస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉమెన్ మిల్క్ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు.
అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లిపాలు అందకపోతే తల్లిపాలు అధికంగా ఉన్న వారి నుంచి సేకరించి ఈ బిడ్డలకు అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యం కేవలం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే ఉందని గుర్తుచేశారు. మధిరలో రూ.34 కోట్లు, సత్తుపల్లిలో రూ.34 కోట్లతో అత్యాధునిక వసతులతో 100 బెడ్ల ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. త్వరలో ఆదిలాబాద్లోనూ క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్కు ఖమ్మం దూరంగా ఉన్నందున మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విజ్ఞప్తి మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కీమోథెరపీ, రేడియోథెరపీ యూనిట్లను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. అలాగే మార్చురీ గదిని కూడా అన్ని హంగులతో ఆధునీకరిస్తామని, ఎంఆర్ఐ యంత్రాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తామని అన్నారు. జ్వర సర్వే వల్ల అద్భుత ఫలితాలు లభించాయని అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 100 బెడ్లతో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం వైద్యసేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఖమ్మం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామని, మంత్రి అజయ్ విజ్ఞప్తి మేరకు ఆసుపత్రుల సంఖ్యను మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం: అజయ్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్, గర్భిణులకు ప్రత్యేక వసతులతో ప్రసవాలను చేసే ఏర్పాట్లు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసం సర్కారు ‘గుండె’ వైద్యం
ఖమ్మం సిటీ, జనవరి 28 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుపేదల గుండెకు సీఎం కేసీఆర్ సర్కారు భరోసా కల్పించింది. హైదరాబాద్, వరంగల్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడాలేని కార్డియాలజీ సేవల సదవకాశాన్ని ఉద్యమ గుమ్మానికి బహూకరించింది. ఇక్కడి సామాన్య ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల సమస్యకోసమని ఎక్కడికో పరుగులు పెట్టకుండా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో క్యాథ్లాబ్ను ఏర్పాటు చేసింది. రూ.7.50 కోట్లతో అత్యాధునిక స్టంట్ మిషన్, మరో రూ.12.50 కోట్లతో యాంజియోగ్రామ్, ఐసీయూ, ల్యాబొరేటరీ, కార్పొరేట్ను మరిపించే 12 బెడ్ల వసతి కలిగిన గదులు వంటి సౌకర్యాలన్నింటినీ కల్పించింది. వాటిని మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. అదే భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ట్రామాకేర్ యూనిట్, ఎంసీహెచ్ భవనంలోని ఉమెన్ మిల్క్ బ్యాంక్ను సైతం వారు జిల్లా ప్రజలకు అంకితం చేశారు.
క్యాథ్లాబ్తో బహుళ ప్రయోజనాలు
ఖమ్మం సిటీ, జనవరి 28 : గుండెకు సంబంధించిన పలు రకాల సమస్యలకు వైద్యసేవలు అందించే కేంద్రాన్ని క్యాథ్లాబ్ అంటారు. దీని ద్వారా నిరుపేద రోగులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా తట్టుకోలేనంత గుండె నొప్పి వచ్చినప్పుడు క్యాథ్లాబ్ నుంచి సేవలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన టీవీలో చూస్తూ గుండెలో ఏ భాగం సమస్యాత్మకంగా ఉంటుందో గుర్తిస్తారు. తొలుత రక్తనాళాల పనితీరును తెలుసుకుంటారు. మూసుకుపోయిన నాళాలను తెరుస్తారు. దీనినే యాంజియోగ్రామ్ అంటారు. అప్పటికీ సమస్య తొలగిపోనట్లయితే యాంజియోప్లాస్టిక్ అంటే స్టంట్ వేస్తారు. అదేవిధంగా గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంటే దానిని సరిచేసేందుకు చేపట్టే వైద్యాన్ని పేస్ మేకర్ అంటారు. ఇది కూడా క్యాథ్లాబ్ (కార్డియాక్ లాబ్)లోనే చేస్తారు. గుండె కవాటాలు మూసుకుపోతే బైపాస్ సర్జరీ చేయకుండా స్టంట్ వేస్తారు. కాళ్లలో రక్త నాళాలు పూడుకుపోతే క్యాథ్లాబ్ సాయంతో స్టంట్, ప్రాంక్రియాస్ పెరిగి కిడ్నీ రక్త నాళాలు ఆగిపోతే స్టంట్ వేసి సరిచేయవచ్చు. వీటన్నింటితోపాటు శరీరంలోని ఏ ఇతర భాగాల్లో అయినా రక్తనాళాలు పనిచేయకపోతే స్టంట్ వేసి రోగి ప్రాణాలను కాపాడే వీలుంటుంది. వీటి వైద్యానికి ప్రైవేట్లో ఒక్కో విభాగానికి రూ.1.50 లక్షల వరకూ ఖర్చవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానలో క్యాథ్లాబ్ ఏర్పాటు చేయడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది.
-డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, ఆర్ఎంవో, ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల
కూసుమంచి నుంచి సత్తుపల్లి దాకా..
కూసుమంచి మండలం నుంచి సత్తుపల్లి దాకా మంత్రి హరీశ్రావు పర్యటన కొనసాగింది. జిల్లా సరిహద్దులో ఉన్న కూసుమంచిలో టీఆర్ఎస్ నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఖమ్మం వచ్చిన మంత్రి.. ప్రభుత్వాసుపత్రిలో క్యాథ్ల్యాబ్, ట్రామాకేర్, మదర్ మిల్క్ బ్యాంక్ను ప్రారంభించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తరువాత జడ్పీ సమావేశ మందిరంలో వైద్య, ఆడిట్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మధిరలో 100 బెడ్లతో నిర్మించనున్న నూతన ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. తరువాత కల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. తదనంతరం సత్తుపల్లికి చేరుకున్నారు.
ఎంసీహెచ్ వరకు నడుచుకుంటూ..
ప్రధాన వైద్యశాల వెనుక భాగంలో ఏర్పాటు చేసిన క్యాథ్లాబ్, ట్రామాకేర్ యూనిట్లను ప్రారంభించిన మంత్రులు.. అక్కడి నుంచి మాతాశిశు ఆరోగ్య కేంద్రం వరకు నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో తమ వద్దకు వచ్చిన పేషెంట్ కేర్లు, ఇతర విభాగాల చిరుద్యోగుల సమస్యలను ఆలకించి సానుకూలంగా స్పందించారు. సమీపంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద ఆగారు. అక్కడ సామాన్య ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆ తర్వాత నేరుగా ఎంసీహెచ్కు వెళ్లి తల్లిపాల బ్యాంక్ను ప్రారంభించారు. అనంతరం వైద్యారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులతో మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్లో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న ప్రసవాల గురించి వాకబు చేశారు. ప్రధానంగా సాధారణ కాన్పులు, సర్జరీల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. ఇక నుంచి నెలకోసారి ప్రసవాలపై సమీక్ష ఉంటుందని, దీనికోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అవసరమైతేనే గర్భిణులకు ఆపరేషన్లు చేయాలని సూచించారు.
కరోనా నిబంధనలతో మంత్రి పర్యటన..
ఖమ్మం, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వైద్య సదుపాయాలు ప్రజలకు తక్షణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో జిల్లాలో పలు వైద్యాభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా సాదాసీదాగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా విజృంబిస్తున్న వేళ ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దనే లక్ష్యంతోనే కార్యక్రమాలను సాదాసీధాగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో కలిసి ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా దూరంగా ఉన్నామన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సౌకర్యాల కల్పన పనులు ప్రారంభంతోపాటు మధిరలో వంద బెడ్ల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి సాదాసీదాగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ఏర్పాటు పనులను మంత్రి అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి పరిశీలిస్తామని వివరించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఎక్కడా బహింరగ సభలు నిర్వహించట్లేదని చెప్పారు.