మిరప తోటల్లో కొత్త రకం తెగులు
ఆందోళనలో మిర్చి రైతులు
నష్ట నివారణ చర్యలు చేపడుదాం
అవగాహన కల్పిస్తున్న అధికారులు
హైదరాబాద్ నుంచి వస్తున్న శాస్త్రవేత్తలు
కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 27:గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రకం పురుగు (తామరపురుగు) మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ముందస్తుగా నష్ట నివారణ చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిర్చిపంట ఎక్కువ మొత్తంలో సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం ముందువరుసలో ఉంది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో నిరుటితో పోల్చితే ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. సాధారణంగా మిరపలో తెల్ల దోమ, తామర పురుగు, ఎర్ర నల్లి, శనగపచ్చ, లద్దెపురుగు వంటివి ఆశించి నష్టం కలుగజేస్తుంటాయి. ఈ ఏడాది తామరపురుగు ఉధృతి చాలా తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. గడిచిన పది రోజుల నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు మిర్చి తోటలను సందర్శించి కొత్త రకం తామర పురుగు ఉధృతిని గుర్తించారు. ఈ పురుగు పూలపై ఆశించి రెక్కల నుంచి, కేసరాల నుంచి రసాన్ని పీల్చుతాయి. దీంతో పూలు వాడిపోతున్నాయి.
జీవిత చక్రం 20-25 రోజులే..
తామరపురుగుల జీవిత చక్రం 20 – 25 రోజులు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా పరిశీలించేందుకు ఇప్పటికే అధికారులు బెంగళూర్ ఎన్బీఏఐఆర్కు పురుగులను పంపించారు. తల్లి పురుగు 150 వరకు గుడ్లను పెడుతుంది. వాటి నుంచే పిల్లలు బయటకు వస్తున్నాయి. పిల్ల పురుగులు రసాన్ని పీల్చి నష్టం కలుగుజేస్తున్నాయి. పెద్ద పురుగులు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాపిస్తున్నాయి. తామర పురుగుల జీవిత చక్రంలో గుడ్డు దశ, పిల్ల పురుగుల దశ, తల్లి పురుగుల దశలు ఉంటాయి. తా మర పురుగులు ఆశించినప్పుడు ఆకుల ముడత పైభాగాన ఉంటుంది. నల్లి ఆశిస్తే కింద ముడతగా పరిగణిస్తాం.
పంటను నష్ట పరిచే విధానం..
సాధారణంగా మిరప పంటను ఆశించే తామర పురుగుకు భిన్నంగా ఈ పురుగు ఉంది. ముదురు నలుపు రంగులో ఉండే తామరపురుగులు 15 – 20 శాతం వరకు పూతను ఆశించి నష్టపరుస్తున్నాయి. దీంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగును నల్లి పురుగుగా భావించి దానికి సంబంధించిన మందులు పిచికారీ చేయడం వల్ల ప్రయోజనం లేకపోవడంతోపాటు పెట్టుబడి ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. సింథటిక్ ఫైరిత్రాయిడ్స్ మందులను, స్పైనోసాడ్, ఫ్రోఫీనోపాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయవద్దని సూచిస్తున్నారు.
పిచికారీ చేయాల్సిన మందులు..
తామర పురుగు నివారణకు అందుబాటులో ఉన్న మందులను పిచికారీ చేయడం ద్వారా పిల్ల పురుగులను నివారించవచ్చు. కానీ తల్లి పురుగులకు వాటిని తట్టుకునే సామర్థ్యం ఉండడం వల్ల నివారించడం కష్టంగా ఉంటుంది. ఇందుకోసం వేపనూనె అజాడిరిక్షన్ పదివేల పీపీఎం రెండు మిల్లీ లీటర్లు, 0.5 గ్రాముల సర్ప్ లేదా ట్రైటాన్ 100 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. దీంతో తల్లి పురుగు గుడ్డు పెట్టకుండా నివారించుకోచ్చు. జీవ శిలీంధ్ర నాశినులైన బవేరియ 5 గ్రాములు, వర్టిసిలియమ్ 5 గ్రాములు, పంచగవ్వ 30 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పురుగు ఉధృతి తగ్గే అవకాశం ఉంది. పురుగు మందులకు సంబంధించి రీజెంట్80డబ్ల్యూజీ 40-50 గ్రాములు లేదా ఎసిటామిఫ్రైడ్ 40 – 50 గ్రాములు లేదా ఇమిడా క్లోఫ్రిడ్, రీజెంట్ 40 – 50 గ్రాముల చొప్పున ఎకరానికి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. దీని ద్వారా పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. పై ముడత, కింది ముడత ఉధృతి ఉన్నట్లు గమనించినట్లయితే డైఫెన్ థయిరాన్ 1.5 గ్రాములు లేదా క్లోరోఫెన్ ఫైర్ రెండు మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి.
రైతులు తొందరగా మేల్కోవాలి..
తామర పురుగు చాలా ప్రమాదం. ఎక్కువ శాతం తోటలను నాశనం చేస్తుంది. ముందస్తుగా మేల్కోకపోతే మిర్చి పంట బాగా నష్టపోవాల్సి వస్తుంది. పురుగు మందులను ఎక్కువ వాడడం వల్లనే ఈ పురుగులు వస్తున్నాయి. ముందుగానే రైతులు తమ చేల్లో జిగురు పూసిన నీలం, పసుపు రంగుల అట్టలను పెట్టడం వల్ల ఆ పురుగులు రాకుండా ఉంటాయి. వచ్చినా వాటికి అతుక్కుపోతాయి. రైతులు తొందరగా మేల్కోవాలి.
-డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, కేవీకే కోఆర్డినేటర్, భద్రాద్రి