నేటి నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు
భద్రాచలం, ఏప్రిల్ 27: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో 15 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణిమ సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం, చక్ర స్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి బేడా మండపానికి తీసుకొని వచ్చి ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రోలు, రోకలికి ప్రత్యేక పూజలు చేసి, పసుపు కొమ్ములను దంచారు. స్వామివారికి ముందుగా చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవ కలశ స్నపనం జరిపించారు. చక్రతీర్థంగా అభివర్ణించే ఈ కార్యక్రమాన్ని పవిత్ర గోదావరిలో నిర్వహించాల్సి ఉండగా కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోనే నిరాడంబరంగా జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను గర్భాలయంలోకి తీసుకొని వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించారు. తరువాత గరుడ ధ్వజ పటాన్ని అవరోహణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. భేరీ పూజ రోజున ఆవాహన చేసిన దేవతలందరికీ ఉద్వాసన జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను12 సార్లు ఆలయ ప్రదక్షిణ చేయించారు. రాత్రికి ఆలయంలోని బేడా మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఫృధవీ శాంత’ అనే మంత్రంతో మహా కుంభ ప్రోక్షణ నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.
నేటి నుంచి నిత్య కైంకర్యాలు..
బ్రహ్మోత్సవాలు ముగియడంతో బుధవారం నుంచి స్వామివారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు, దర్బారు సేవ, దశవిధ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పర్ణశాలలో.. పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలోనూ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వారికి అర్చకులు చక్రతీర్థంతో పాటు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.