కూరగాయల సాగు.. బహుబాగు
ఆ పంటలతో రైతుకు ఏడాది పొడవునా ఆదాయం..
విరివిగా మార్కెటింగ్ సౌకర్యమూ కల్పిస్తున్నాం..
బహుళ పంటలకు చిరునామాగా ఉద్యాన సాగు
అన్నదాతలు వరిని వదిలి ఆయిల్పాం వైపు మళ్లుతున్నారు..
రాయితీలు, ఇతర సౌకర్యాలపై అవగాహన కల్పిస్తున్నాం
‘నమస్తే’ ఇంటర్వ్యూలో డీఎస్హెచ్వో అనసూయ
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 26 :‘స్పల్పకాలిక పంటలైన ఆకుకూరలు, కూరగాయల సాగు చేపడితే రైతులకు ప్రతిరోజూ ఆదాయమే. దీర్ఘకాలిక పంటలకు అధిక చీడపీడల బెడద ఎక్కువ. సాగునీరు, పెట్టుబడి వంటివి అధికంగా కావాలి. ఉద్యాన పంటల సాగు అందుకు కాస్త భిన్నం. అందుకని ఉద్యాన సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రాయితీల గురించి వివరిస్తున్నాం. సాగులో మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం.’ అంటున్నారు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జి.అనసూయ. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తరుణంలో ఉద్యాన పంటలపై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ‘ఉద్యాన పంటలు – వాటి ప్రయోజనాలు’ వంటి అంశాలను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘ఉద్యాన సాగుకు ఖమ్మం జిల్లా చిరునామాగా ఉంది. అయితే అక్కడక్కడా కొందరు రైతులు చెలకలను అచ్చుకట్టి పొలాలుగా తయారు చేయడంతో కొంతమేర సాగు తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యాన పంటలే మేలు. ఇప్పుడు వీటిని సాగు చేస్తే జిల్లా ప్రజల అవసరాలకు అందుతాయి. ఇతర పంటలను ఎంచుకునే రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం.’ అంటున్నారామె.
నమస్తే : ఉద్యాన పంటలతో కలిగే అదనపు ప్రయోజనాలేంటి?
డీహెచ్ఎస్వో: వ్యవసాయ పంటల సాగుతో పోల్చుకుంటే ఉద్యాన పంటల సాగు ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటల సాగు చేయొచ్చు. కేవలం ఎకరం పొలంలో సుమారు 7 – 8 రకాల కూరగాయలు, ఆకుకూరల పండించే వెసులుబాటు ఉంటుంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుంది. ఏడాదిలో 3 – 4 రకాల పంటల సాగు చేసుకోవచ్చు. ఆదాయమూ అధికంగానే వస్తుంది. జిల్లాలోని నేలలు కూడా ఉద్యాన పంటలకు ఎంతో అనువైనవి.
నమస్తే : మార్కెటింగ్, డిమాండ్ ఎలా ఉన్నాయి?
డీహెచ్ఎస్వో: ప్రస్తుతం జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆయా రకాల పంటలు ఉత్పత్తి కావడం లేదు. ఉల్లి, ఆలుగడ్డ, పూలు, కోతిమీర వంటి ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ లోటును పూడ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాం. ఖమ్మం నగర శివారు మండలాల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. ఇంకా మరింత విస్తీర్ణంలో సాగు చేయాలి. మార్కెటింగ్కు కూడా అవకాశం ఉంటుంది. నగరంలో విరివిగా రైతుబజార్లు ఉన్నాయి. వాటిల్లో విక్రయించుకోవచ్చు. లేదా సొంతంగానైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు.
నమస్తే : బహుళ పంటలు ఎంత వరకు ప్రయోజనం?
డీహెచ్ఎస్వో: వ్యవసాయ పంటలైనా, ఉద్యాన పంటలలైనా ఒకే రకం వేయొద్దు. బహుళ పంటలువ వేయడమే ఎంతో ఉత్తమం. మార్కెట్లో ఒక్కోసారి ఒక్కో పంటకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బహుళ పంటల వల్ల అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఆయిల్పాం, పండ్ల తోటల్లో అంతర పంటలుగా అనేక రకాలైన పంటలను సాగు చేయడం ఎంతో ప్రయోజనం. కూరగాయల పంటల మధ్యలో ఆకు కూరలనూ సాగు చేయొచ్చు.
నమస్తే : ఉద్యాన పంటల సాగుకు రాయితీలున్నాయా?
డీహెచ్ఎస్వో: పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో ఆది నుంచి ఉద్యాన పంటల సాగు అధికంగానే ఉంటున్నది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 2,199 మంది రైతులు సుమారు 1.96 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్పాం సాగు చేస్తున్నారు. పట్టు పురుగుల పెంపకం, మల్బరీ సాగు చేపట్టే రైతులకు మంచి రాయితీలు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద షెడ్ నిర్మాణం, ఇతర ఖర్చులకు రూ.2.40 లక్షలు, జనరల్ రైతులకు రూ.2 లక్షల వరకు రాయితీ ఇస్తున్నాం. పందిరి పద్ధతి ద్వారా కూరగాయల సాగు చేపడితే ఎకరానికి రూ.50 వేల సబ్సిడీ ఉంటుంది. పండ్లతోటల రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నాం. మూడేళ్ల వరకూ నిర్వహణ ఖర్చులు ఇస్తున్నాం. ఇక పామాయిల్ సాగుకు రాయితీలు అధికంగానే ఉన్నాయి.
నమస్తే : ఇతర పంటల సాగులో ఉద్యాన పంటల పాత్ర ఎంత?
డీహెచ్ఎస్వో: వరికి బదులుగా ఇతర పంటల సాగు చేపట్టడం ద్వారా మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ప్రతి రైతుకూ అవగాహన కల్పిస్తున్నాం. వరికి బదులు ఇతర వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలకూ ఎంతో ఆస్కారముంటుందనే విషయాలను వివరిస్తున్నాం. రైతుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేపట్టేలా కృషి చేస్తున్నాం. సూక్ష్మనీటి పథకానికి మూడేళ్ల దాకా నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే ఇస్తుంది. దీంతోపాటు జిల్లాలో మల్బరీ సాగు, నగర శివారు మండలాల్లో కూరగాయల సాగు మరింత పెరిగే అవకాశముంది. చెలకలను అచ్చుకట్టి పొలాలుగా మార్చిన రైతు లు కూడా తిరిగి వా టిల్లో ఉద్యాన పంటలను సాగు చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.