మరింత అభివృద్ధికి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా
రూ.44 వేల కోట్లతో జిల్లా అభివృద్ధి: తుమ్మల
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామినవుతా
స్థానిక సంస్థల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి మధు
అశ్వారావుపేటలో టీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం
అశ్వారావుపేట, నవంబర్ 26: సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మరింత అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధును అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని, దీనికి తోడు ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా వానకాలం సీజన్లో పండిన ధాన్యం మొత్తాన్ని రాష్ట్రం సేకరిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దృష్టిలో పెట్టుకొని రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని మంచి లాభాలు పొందాలని ఆకాంక్షించారు.
రూ.44 వేల కోట్లతో అభివృద్ధి: తుమ్మల
సీఎం కేసీఆర్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను రూ.44 వేల కోట్లతో అభివృద్ధి చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాకు అవసరమైన అన్ని అత్యవసర పనులనూ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఈర్ష్య పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని సూచించారు.
ఆశీర్వదించండి: తాతా మధు
సీఎం కేసీఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను కూడా భాగస్వామినవుతానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు అన్నారు. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీ అందించాలని కోరారు. ఎన్నికలు అంటేనే టీఆర్ఎస్ పార్టీకి విజయ చిహ్నమని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా విజయం టీఆర్ఎస్ అభ్యర్థులదేనని, త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధుకు భారీ మెజారిటీ ఖాయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నేతలు పాల్గొన్నారు.