కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 7: మావోయిస్టులు శాంతిని కోరుతూ లేఖలు విడుదల చేస్తున్నా అడవుల్లో ఆపరేషన్ ‘కగార్’ దండయాత్ర మాత్రం ఆగడం లేదు. వారి లేఖలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుగా సాగుతున్నాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య బుధవారం జరిగిన భీకర పోరులో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు.
వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ ‘కగార్’లో భాగంగా 15 రోజులకు పైగా మావోయిస్టుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు బస్తర్ రేంజ్ అధికారులు 26 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని పేర్కొంటున్నారు.
మృతుల్లో ఓ అగ్ర నాయకుడు సైతం ఉన్నట్లు సమాచారం. వంద సంఖ్యలో జిల్లా రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు డ్రోన్ కెమెరాల ఆధారంగా మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చిత్రీకరించి, వారి జాడను గుర్తించిన తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముప్పేట దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పలువురు మావోయిస్టులు మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు, మందుగుండు, సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పర్చుకున్న ఆయుధ తయారీ కర్మాగారాలు, బంకర్లను జవాన్లు సీజ్ చేశారు. మృతుల వివారాలను తెలుసుకునేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే వారి పేర్లతోపాటు క్యాడర్ను వెల్లడిస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.