కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 28: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మంగళవారం జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళా జాతరను తలపించింది. జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ యువతీయువకులు తరలిరావడంతో కొత్తగూడెం క్లబ్ ప్రాంగణమంతా నిండిపోయింది. ఖాళీలను భర్తీ చేసుకునేందుకు 26 కంపెనీలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చారు. 5,200 మంది నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత వివరించారు. మొత్తం 26 కంపెనీల్లో 2,037 మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాల కోసం ఎంపికైనట్లు చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు.
నిరుద్యోగులందరూ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒకవేళ వెంటనే ఉద్యోగం రాకపోతే నిరాశ చెందవద్దన్నారు. మరోప్రయత్నం చేయాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఉద్యోగం సాధించిన యువతకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. యువతీయువకులు నిరంతరం తమ ప్రతిభకు పదును పెడుతూ ఉన్నప్పుడే జీవితంలో స్థిరపడతారని అన్నారు. వచ్చిన ఉద్యోగం చిన్నదే అయినా అందులో చేరి ప్రతిభతో ముందుకు పోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కాపు సీతాలక్ష్మి, భూక్యా రాంబాబు, బత్తుల వీరయ్య, మండె వీరహన్మంతరావు, కోలాపురి ధర్మరాజు, బాదావత్ శాంతి, రుక్మాంగదర్, పల్లపు లక్ష్మణ్, ఎంఏ రజాక్, బడుగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
2,037 మందికి ఉద్యోగాలు
ఈ జాబ్మేళాలలో మొత్తం 2,037 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారికి ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి నియామక పత్రాలు అందించారు. ఈ జాబ్మేళాకు వచ్చిన దివ్యాంగుడిని ఏ కంపెనీ కూడా తీసుకోకపోవడంతో స్వయంగా ఉపాధి కల్పన అధికారి విజేత అతడితో కలిసి నేలపై కూర్చున్నారు. అతడి అప్లికేషన్ను పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.