పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి
రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశం
మంత్రి కమలాకర్, కమిషనర్లతో ఫోన్లో మాట్లాడిన అజయ్
అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష
ఖమ్మం, మే 25 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : “జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొవిడ్ కారణంగా ఆలస్యమైనా.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, ట్రాన్స్పోర్ట్ విషయంలో కాంట్రాక్టర్లు సహకరించాలన్నారు. జిల్లాలో యాసంగి 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకు 2.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 106 మిల్లులను కేటాయించిందని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ సీజన్లో పంజాబ్ తర్వాత ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో యాసంగి 2020-2021గాను 3లక్షల 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకు 2 లక్షల 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. మిగిలిన లక్షా 9వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు పది రోజుల్లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పార్బాయిల్డ్ రైస్ మిల్లులు సరిపోను లేకపోవడంతో నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మిల్లుకు ధాన్యాన్ని పంపించేందుకు మిల్లుల కేటాయింపు జరిగిందన్నారు. వాటిల్లో నల్గొండ జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇప్పటికే కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లిప్టు చేయడం పట్ల పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆ శాఖ కమిషనర్లతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫోన్లో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. నల్గొండ జిల్లాకు కేటాయించిన ధాన్యాన్ని కూడా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు పంపించేలా తీర్మానం చేసి వెనువెంటనే ప్రభుత్వానికి పంపించారు.
ఈ సంవత్సరం యాసంగి సీజన్లో పంటసాగు విస్తీర్ణం పెరిగిందని, కొవిడ్ 19 వల్ల ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగిందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు కాటా వేసి ఉంచిన 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పాటు ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, ట్రాన్స్పోర్ట్ విషయంలో కాంట్రాక్టర్లు సహకరించాలన్నారు. జిల్లాలోని 2,3,4,5 సెక్టార్లలో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు రైతుల నుంచి బస్తాకు రూ.5 వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, ఇది సరికాదన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గతేడాది కరోనా సమయంలో జిల్లాలో పూర్తిస్థాయి ధాన్యం సేకరించడంతో జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో ఈ సీజన్లో సమస్యలను అధిగమించి రైతులకు నష్టం జరుగకుండా పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ జరగాలని సూచించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే విషయంలో లోడింగ్, అన్లోడింగ్ సమయంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
దీనిపై పౌరసరాఫరాల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ మంత్రి అజయ్కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో పది రోజుల్లోపు ధాన్యం సేకరణ పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్ మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలోని ధాన్యం సేకరణ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 9 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందని, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని త్వరగా మిల్లులకు తరలించాలని కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీపీ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, కమిషనర్ అనురాగ్ జయంతి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, సుడా చైర్మన్ విజయ్కుమార్, మేయర్ నీరజ, డీఎస్వో రాజేందర్ పాల్గొన్నారు.